కేసీఆర్ కలల పంట ఎంత భారీగా.. మరెంత రిచ్ గా ఉండనుందంటే?

గడిచిన నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో ఒకటి.. తెలంగాణ సచివాలయం. ఇంతకాలం న్యాయపరమైన అంశాల్లో ఉండిపోవటంతో.. తనకున్న ఆలోచనల్ని వాస్తవరూపం దాల్చకుండా ఆగిపోవటంతో.. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయారు. కోర్టు నుంచి చిక్కులు వీడిపోవటం.. తాను అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేసేందుకు అవకాశం లభించటంతో.. కొత్త సచివాలయానికి సంబంధించి ప్లానింగ్ ను ముమ్మరం చేశారు.

రికార్డు సమయంలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. కొత్త సచివాలయానికి సంబంధించిన డిజైన్ కు సంబంధించి మార్పులు చేర్పులు చేసిన ఆయన.. తాజాగా తన కలల పంట వాస్తవంలో ఎలా ఉంటుందన్న దానికి సంబంధించిన కొంత సమాచారం బయటకు వచ్చింది. డెక్కన్ – కాకతీయ శైలిలో రూపుదిద్దుకోబోతున్న ఈ భారీ భవనం ఎత్తు 278 అడుగులుగా చెబుతున్నారు. ఇందులో మధ్య భాగంలో ఉండే ప్రధాన గుమ్మటం ఎత్తే ఏకంగా 111 అడుగులు కావటం విశేషం.

మొదట ఆరు అంతస్తుల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినా.. ఇటీవల దీన్ని ఏడు అంతస్తులుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన గుమ్మటం ఎత్తు.. ఏకంగా నాలుగు అంతస్తులకు సమానంగా ఉండటం విశేషం. ఇక.. గుమ్మటంపైన పదకొండు అడుగుల ఎత్తుతో నాలుగు సింహాలతో కూడిన అశోకముద్ర ప్రత్యేక ఆకర్షణ కానుందని చెబుతున్నారు. భవన పైభాగం మధ్యలో విశాలమైన స్కైలాంజ్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ స్కైలాంజ్ 50 అడుగుల ఎత్తులో ఉండనుంది. దీనిపైనా 50 అడుగుల ఎత్తులో గుమ్మటం పై భాగం ఉండనుందని చెబుతున్నారు. పాత సచివాలయానికి మూడు వైపులే రోడ్డు ఉంది. అందుకు భిన్నంగా కొత్త సచివాలయానికి మాత్రం నాలుగు వైపులా రోడ్డు ఉండేలా డిజైన్ చేశారు. రోడ్డు రూపంలో గతంలో ఉన్న వాస్తులోపం.. తాజా మార్పుతో పోతుందని చెబుతున్నారు.

మింట్ భవనం.. సచివాలయం మధ్యన కొత్తగా రోడ్డును నిర్మిస్తారు. గతంలో జీ బ్లాక్ ఉన్న ప్రాంతానికి కాస్త అటుఇటుగా.. ప్రధాన భవనం నిర్మితం కానుంది. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ప్రాంతం కొత్త ప్రహరీకి అవతల భాగంలో ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో.. ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయ ప్రవేశ ద్వారా కనుమరుగైనట్లే.ఎప్పటిలానే హుస్సేన్ సాగర్ వైపు ఉన్న పాత ప్రవేశ ద్వారమే..కొత్తగా కూడా ఉండనుంది.

కొత్త సచివాలయ బేస్ మెంట్ కోసం రాజస్తాన్ లోని ధోల్ పూర్ లో లభించే ఎర్రటి రాయిని వాడనున్నారు. పార్లమెంటు భవనానికి ఈ రాయినే వినియోగించారు. ముఖ్యమంత్రి కార్యాలయమైన ఏడో అంతస్తు పూర్తిస్థాయి బుల్లెట్ ఫ్రూప్ గా నిర్మించనున్నారు. భవనం మొత్తం తెలుపురంగుతో ఉంటుందని.. కిటికీలు మాత్రం నీలి రంగు అద్దాలతో ఉంటాయని చెబుతున్నారు.

ప్రవేశ ద్వారా వద్ద ఉండే పోర్టికో పైన జాతీయపతాకం దిమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం కొత్త సచివాలయం ఖర్చు దగ్గర దగ్గర రూ.450 కోట్లు చెబుతున్నా.. నిర్మాణం పూర్తి అయ్యే నాటికి ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ స్వప్నం సాకారమయ్యే వేళలోనూ ఖర్చు గురించి మాట్లాడుకోవటమా?