అల్లుడు వ‌స్తాడు.. వెళ్తాడు..: లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే స‌టైర్లు

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాద‌యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు సంబ‌రాలు చేసుకున్నారు. ఇక‌, నంద‌మూరి కుటుంబం, నారా ఫ్యామిలీ కూడా నారా లోకేష్‌తో క‌లిసి పాద‌యాత్ర‌లో అడుగులు క‌దిపింది. మొత్తంగా సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ప‌సుపు జెండా రెప‌రెప‌లాడ‌గా.. త‌మ్ముళ్లు సంఘీభావ పాద‌యాత్ర‌ల‌తో క‌దం తొక్కారు. అయితే.. ఈ పాద‌యాత్ర‌పై తాజాగా వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి స‌టైర్లు వేశారు.

లోకేష్ పాదయాత్ర నూరురోజు లైనా, వెయ్యి రోజులైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ ప్రయోజనం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు వ్యాఖ్యానించారు. తండ్రి చంద్ర‌బాబును ముఖ్యమంత్రిని చేసుకోవడానికే ఈ యాత్ర చేప‌ట్టార‌ని విమ‌ర్శించారు. టీడీపీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చ లేకపోయిందని విమర్శించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని నారా లోకేష్ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిపడ్డారు. టీడీపీకి లోకేష్ పాదయాత్ర వల్ల నయా పైసా ప్రయోజనం ఉండదన్నారు.

ప్రొద్దుటూరుకు లోకేష్ పాదయాత్ర వస్తే అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. లోకేష్ పాదయాత్రతో తనకు వచ్చేనష్టం లేదని.. ‘‘అల్లుడిలా వస్తాడు వెళతాడు’’ అంటూ ఎమ్మెల్యే రాచమల్లు స‌టైర్లు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాద‌యాత్ర సాగిన ప్రాంతాల్లో ఎవ‌రైనా ఒక్క‌రైనా నాయ‌కులు వ‌చ్చి టీడీపీలో చేరారా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఎవ‌రో ఒక‌రిని రోజూ తీసుకువ‌చ్చి పాద‌యాత్ర స‌క్సెస్ అయింద‌ని చూపించుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేసినా.. తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ అడ్డు చెప్ప‌న‌ని.. అలా చేస్తే.. లేనిపోని మైలేజీ ఇచ్చిన వాడిని అవుతాన‌ని అన్నారు.