వివేకా హత్య కేసులో రెండు కీలక పరిణామాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రెండు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి షాకులుగా మారినట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ ను మరోసారి తమ ఎదుట హాజరు కావాలని.. విచారణ కోసం తాజాగా నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలన్నది నోటీసులు సారాంశం.

దీంతో.. సీబీఐ నోటీసులకు స్పందించిన అవినాశ్ రెడ్డి.. హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్యన రోజుకో పరిణామంతో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పరుగులు తీసినట్లుగా కనిపించింది. దీనికి తోడు అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయటం.. అవినాశ్ ను అరెస్టుచేయాల్సిందేనని ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కోర్టుకు సీబీఐ వెల్లడించటం తెలిసిందే.

ఆ తర్వాత.. ఈ కేసు విచారణ స్తబ్దుగా మారినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళలోనే మరోసారి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు పంపటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఎంపీ అవినాశ్ రెడ్డి సన్నిహితులు.. వివేకా హత్య కేసులో ఏ6గా ఉన్న గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ కు నో చెప్పింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.

వివేకా హత్య అనంతరం.. సాక్ష్యాల్ని నాశనం చేయటంలో ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. వివేకా హత్య విషయం బయట ప్రపంచానికి తెలియటానికి ముందే ఉదయ్.. ఎంపీ అవినాశ్ ఇంట్లో ఉన్నట్లుగా సీబీఐ చెబుతోంది. హత్య రోజు తెల్లవారుజామున 3.40 గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొంది.

వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు కట్లు కట్టడం.. ఆయన భౌతికకాయాన్ని ఫ్రీజర్ లో ఉంచే ఏర్పాట్లు చేయటం.. ఇతర ఆధారాల్ని చెరిపేసే ఉదంతంలో ఆయన కీలకభూమిక పోషించారన్నది ఆయన మీద ఆరోపణలు. ఏప్రిల్ 14న సీబీఐ అతడ్ని అరెస్టు చేసింది. కస్టడీ ముగిసిందని.. విచారించేందుకు ఇంకేమీ లేదని.. అందుకే తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా జరిపిన విచారణలో బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది.