కేసీయార్ ఆశలన్నీ అదేనా ?

రాబోయే ఎన్నికల్లో ఓట్ల చీలికపైనే కేసీయార్ ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. హోరాహోరీగా బీజేపీ-కాంగ్రెస్ మధ్య సాగిన కర్నాటక ఎన్నికల్లో హస్తంపార్టీ ఘన విజయం సాధించింది. అయితే అదే తెలంగాణాలో కూడా రిపీట్ అవుతుందని గట్టిగా చెప్పేందుకు లేదు. కాకపోతే గణనీయంగా పుంజుకుంటుందనే వాదన అయితే పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే కేసీయార్ తన సన్నిహితుల దగ్గర తాజాగా ఒక విషయాన్ని పంచుకున్నారట.

అదేమిటంటే తెలంగాణాలో మూడుపార్టీల మధ్య ఓట్లలో చీలిక ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ కు ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారట. అర్బన్ ప్రాంతంలో బీజేపీ, రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పుంజుకున్నా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవన్నది కేసీయార్ భావనట. అంటే తన పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందని కేసీయార్ అంగీకరిస్తున్నట్లు అర్ధమవుతోంది. కాకపోతే అధికారం అందుకునే విషయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్లు చీలిపోతుందని నమ్ముతున్నారు.

ఓట్ల చీలిక కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పార్టీల మధ్య విడిపోతాయని కేసీయార్ బాగా ధీమాగా ఉన్నారు. దాని కారణంగానే అధికారంలోకి రావటం ఖాయమని కేసీయార్ అనుకుంటున్నారు. కేసీయార్ లాజిక్ లో తప్పేమీలేదు. కాకపోతే అర్బన్ ప్రాంతంలోని ఓటింగ్ అంతా బీజేపీ వైపు వెళుతుందని గ్యారెంటీ ఏమిటి ? అలాగే రూరల్ ఏరియాల్లో ఓట్లు కాంగ్రెస్ కు మాత్రమే పడతాయనే లెక్కేంటో అర్ధంకావటంలేదు.

కర్నాటక ఎన్నికల ఫలితాలనే తీసుకుంటే అర్బన్ తో పాటు రూరల్ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కు మంచి ఆధరణ కనిపించింది. గ్రేటర్ బెంగుళూరులో బీజేపీతో దాదాపు సమానంగా కాంగ్రెస్ సీట్లలో గెలిచిందంటే అర్ధమేంటి ? కాబట్టి వేవ్ ఉందంటే ఆ వేవ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో ఇపుడే చెప్పటం కష్టం. బీజేపీకి ఓట్లు వేసినా ఉపయోగం ఉండదని జనాలు అనుకుంటే గ్రేటర్ హైదరాబాద్ అని అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అని జనాలు చూడరు. కేసీయార్ ను దింపేయటమే టార్గెట్ గా పెట్టుకుంటే కాంగ్రెస్ కు అయినా ఓట్లు గుద్దేస్తారు. అయితే ఓటర్ల ఆలోచనంతా ఒకటే విధంగా ఉంటుందని, ఉండదని చెప్పేందుకు లేదు. ఏదేమైనా ఓట్ల చీలికే తనను గట్టెక్కిస్తుందని కేసీయార్ నమ్మకమైతే పెట్టుకున్నట్లున్నారు.