తెలంగాణా కాంగ్రెస్ లో మంచి జోష్..వాట్ నెక్స్ట్ ?

కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా కాంగ్రెస్ లో మంచి జోష్ ను పెంచుతున్నట్లుంది. నేతలంతా మహా సంతోషంగా ఉన్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమంటే కర్నాటక ఎన్నికల్లో తెలంగాణా నేతలు కూడా ప్రచారం చేశారు. కర్నాటకలో తెలంగాణా జనాలుండే ప్రాంతాల్లో చాలామంది తెలంగాణా కాంగ్రెస్ నేతలు ప్రచారంచేశారు. కారణాలు ఏవైనా నువ్వానేనా అన్నట్లుగా బీజేపీతో జరిగిన పోరులో కాంగ్రెస్ మంచి విజయం సాధించింది. ఇక రెండో కారణం ఏమిటంటే కర్నాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణాలో కూడా రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు.

నిజానికి కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణాలో రిపీట్ అవుతాయని చెప్పేందుకు లేదు. ఎందుకంటే కర్నాటకలో ఇద్దరు అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మంచి సయోధ్యతో ఎన్నికలను ఎదుర్కొన్నారు. వర్గాలుగా విడిపోయి టికెట్ల కోసం కొట్టుకోలేదు. టికెట్ల కేటాయింపు, ప్రచార బాధ్యతలతో పాటు ఎన్నికల ఖర్చులను కూడా చాల జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు బాగా ఉపయోగపడింది.

ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ ఫుల్లుగా అడ్వాంటేజ్ గా తీసుకున్నది. అయితే తెలంగాణాలో పరిస్ధితులు విరుద్ధంగా ఉన్నాయి. కేసీయార్ పాలనపైన ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పూర్తిస్ధాయిలో అడ్వాంటేజ్ గా తీసుకోలేకపోతోంది. ఎందుకంటే పీసీసీ అద్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డంటే సీనియర్లలో చాలామంది మండిపోతున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లలో కొందరు ప్యారలల్ రాజకీయం చేస్తున్నారు.

రేవంత్ అవునంటే వాళ్ళు కాదంటున్నారు. రేపు అభ్యర్ధుల ఎంపికలో రేవంత్ ను అందరు కలిసి ఇబ్బంది పెట్టడం ఖాయం. రేవంత్ ఇబ్బందిపెట్టడంలో పార్టీ పరువుపోయినా పర్వాలేదన్నట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి సీనియర్లు వ్యవహరిస్తున్నారు. టికెట్ల దగ్గరే పంచాయితీలు మొదలైతే ఇక ప్రచారం, నిధుల పంపిణీలో ఇంకెంత గొడవలవుతాయో ఊహించుకోవచ్చు. తెలంగాణా జనాల్లో కేసీయార్ అంటే వ్యతిరేకతుంది. కాంగ్రెస్ అంటే అభిమానముంది. కాకపోతే పార్టీ మీద అభిమానం నేతల్లోనే లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ?