ఎర్రిపప్ప సీఎం జగన్ గారు ధాన్యం ఎప్పటిలోగా కొంటారు: నారా లోకేష్‌

టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కోటీశ్వరుడైన ముఖ్య‌మంత్రి జగన్ కి – కూటికి లేని పేదలకు మధ్య యుద్ధం జరగనుందని అన్నారు. ఊసరవెల్లి జగన్ నిక్కర్ వేసుకునే టైం లోనే టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు ఎన్టీఆర్ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేశార‌ని అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్ జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.

తడిచిన ధాన్యం కొనమని ఒక రైతు మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావును బ్ర‌తిమాలితే.. ఎర్రిపప్ప అని తిట్టార‌ని.. ఇదేనా రైతు సంక్షేమం.. రైత‌న్న రాజ్యం అని నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎర్రి ప‌ప్ప అంటే.. బుజ్జినాన్న అంటార‌ని మంత్రి సిగ్గు లేకుండా స‌మ‌ర్థించుకున్నార‌ని ఎద్దేవా చేశారు. ఎర్రిపప్ప సీఎం జగన్ గారు ధాన్యం ఎప్పటిలోగా కొంటారు అని నారా లోకేష్‌ ప్రశ్నించారు.

మంత్రి కారుమూరి, సీఎం జగన్ రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పే వరకూ ఈ ప్రభుత్వాన్ని ఎర్రిపప్ప ప్రభుత్వం అని, ఎర్రిపప్ప జగన్ అని పిలుస్తామ‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. నాది అంబేద్కరిజం... జగన్ ది సైకోయిజం. మీరు అంబేద్కర్ గారి వైపు ఉంటారా? సైకో వైపు ఉంటారా తేల్చుకోండి. రాబోయేది టీడీపీ ప్రభుత్వం. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు వడ్డీతో సహా చెల్లిస్తాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రాష్ట్రానికి తెచ్చి శిక్షిస్తాం అని లోకేష్ హెచ్చరించారు.

వృథాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలని మొదట ఆలోచించింది ఎన్టీఆరేన‌ని లోకేష్ చెప్పారు. తెలుగుగంగ ప్రాజెక్టు, వెలుగోడు జలాశయం నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని వెల్లడించారు. జగన్ ఒక పిరికోడు అందుకే మీ లోకేష్‌ని అడ్డుకోవడానికే జీవో1 తెచ్చాడు. ఏ1 నువ్వు తెచ్చిన జీవో1 మడిచి ఎక్క‌డ పెట్టుకుంటావో పెట్టుకో అని నేను ఆరోజే చెప్పా అని నిప్పులు చెరిఆరు. ఇప్పుడు ఆ జీవోని హైకోర్టు కొట్టేసిందని.. 2024 ఎన్నికల్లో ఏ1 జెండా పీకేయడం పక్కాయేనని లోకేష్ వ్యాఖ్యానించారు.