గెలిచి ఉంటే మోడీ… ఓడిన ఫ‌లితం ఎవ‌రి ఖాతాలో?!

Narendra Modi

క‌ర్ణాట‌క‌లో బీజేపీ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. 2007లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ అప్ప‌ట్లోనే 78 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని.. అప్ప‌టి నుంచి ఇంతింతై.. అన్న‌ట్టుగా ఎదుగుతూ వ‌చ్చింది. ఘ‌నంగా గ‌త 2018 ఎన్నిక‌ల్లో 104 స్థానాలు ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు వీటికి భిన్నంగా కేవ‌లం 65 స్థానాల‌కు ప‌డిపోయింది. అయితే.. ఓట‌మి విష‌యాన్ని పక్క‌న పెడితే.. బీజేపీ గెలిచి ఉంటే.. ఇదంతా కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ ఖాతాలోకే వెళ్లి ఉండేది.

మోడీ దూర దృష్టి.. ఆయ‌న విజ‌న్‌.. ఆయ‌న అభివృద్ధి అంటూ.. మొత్తం ఫ‌లితాన్ని ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టి.. 2024 ఎన్నిక‌ల్లో బీజేపీకి దేశంలో మ‌రోసారి బాట‌లు ప‌రిచేందుకు బీజేపీ నేత‌లు స‌మాయ‌త్తం అయ్యేవారు. పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా సంబరాలు చేసేవారు. మోడీని మ‌రోసారి ఆకాశానికి ఎత్తేసేవారు. అయితే.. ఇప్పుడు బీజేపీకి అనూహ్య ఓట‌మి ఎదురైంది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క‌మ‌లం పార్టీని ప్ర‌జ‌లుకుమ్మేశారు మ‌రి ఇప్పుడు ఈ ప‌త‌నానికి కార‌ణం ఎవ‌రు? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఇప్ప‌టికిప్పుడు ఈ ఓట‌మిని త‌న నెత్తిన వేసేసుకున్నారు క‌ర్ణాట‌క ప్ర‌స్తుత సీఎం(తాజాగా రాజీనామా చేశారు) బ‌స‌వ‌రాజ బొమ్మై. నైతిక బాధ్య‌త వ‌హిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. నిజంగానే పార్టీ గెలిచి ఉంటే.. ఈయ‌న బాధ్య‌త వ‌హించేవారా? సంబ‌రాలు చేసుకునేవారా? అనేది ప్ర‌శ్న‌. మరోవైపు.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాపై క‌త్తి వేలాడుతోంద‌ని అంటున్నారు. ఈ ఏడాది జ‌రిగిన హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌(న‌డ్డా సొంత రాష్ట్రం) రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయింది. దీంతో అక్క‌డా స‌ర్కారు కోల్పోయింది.

అయితే.. అక్క‌డ ప‌రాజ‌యంతోనే న‌డ్డాను బాధ్యుడిని చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అక్క‌డ ఆయ‌న త‌ప్పించుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం వేటు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే..ఇక్క‌డ అనేక ధ‌ర్మ సందేహాలు తెర‌ మీదికి వ‌స్తున్నాయి. నిజానికి క‌ర్ణాట‌క‌లో టికెట్ల నుంచి ప్ర‌చారం వ‌ర‌కు అంతా కూడా.. ప్ర‌ధాని మోడీ పార్టీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి అమిత్ షాలే చూసుకున్నారు. ప్ర‌చార ప‌ర్వాన్ని కూడా వారే నిర్దేశించారు. ఈ నేప‌థ్యంలో నైతికంగా చూస్తే.. ఓట‌మి ఎవ‌రి ఖాతాలో వేయాలో.. ఇట్టే అర్థ‌మ‌వుతుంది.