సిద్ధ.. శివ.. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. గడిచిన కొద్ది నెలలుగా హాట్ హాట్ గా మారిన కన్నడ రాజకీయం ఒక కొలిక్కి వచ్చినట్లే. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ లభించటంతో కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీగా అవతరించింది. మొత్తం 224 స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 113 స్థానాలు అవసరం కాగా.. బీజేపీ 64 స్థానాలతో ఆగిపోతే.. జేడీఎస్ 20 స్థానాల్ని (19 స్థానాల్లో గెలుపు.. ఒక స్థానంలో అధిక్యత) గెలుచుకోగా.. ఇతరులు నాలుగుస్థానాల్లో విజయం సాధించారు. ఇక.. ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ 134 స్థానాల్లో విజయం సాధించగా.. రెండు స్థానాల్లో అధిక్యతతో కొనసాగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల కంటే అదనంగా 23 స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నట్లే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖరారైనట్లే.

మరి.. కర్ణాటకకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి పదవి అన్నంతనే ఇద్దరు ముఖ్య నేతలు రేసులో నిలుస్తారు. వారిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అయితే.. మరొకరు పార్టీ రాష్ట్ర చీఫ్ గా వ్యవహరిస్తున్న డీకే శివకుమార్. వాస్తవానికి ఈ ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు.భిన్న ధ్రువాలుగా ఉన్నప్పటికి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం.. ఈ ఇద్దరు నేతలు కలిశారు. ముందు పార్టీనిగెలిపించిన తర్వాత మిగిలిన సంగతులు చూసుకుందామన్న ఒప్పందానికి వచ్చి.. ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేశారు. చివరకు అనుకున్నది సాధించారు.

మరి.. ఈ ఇద్దరిలో సీఎం కుర్చీ దక్కేదెవరికి? అన్నది చూస్తే.. ప్రజాభిప్రాయం ప్రకారం (కొన్ని మీడియా సంస్థల సర్వే రిపోర్టుల్ని చూస్తే) సీనియర్ నేత సిద్దరామయ్య వైపు కన్నడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆయనకే సీఎం పగ్గాలు ఇవ్వాలని ఎక్కువ మంది కోరుతున్నారు. ఈ విషయంలో డీకే శివకుమార్ రేసులో వెనుకబడి ఉన్నారని చెప్పాలి. అయితే.. డీకే శివకుమార్ ను దారిలోకి తెచ్చుకునేందుకు మోడీషాలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయనపై సీబీఐ..ఈడీ దాడులతో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేయటమే కాదు.. పలు కేసులు నమోదు చేసి తీహార్ జైల్లో 104 రోజులు ఉండి వచ్చారు. ఆయన తీహార్ జైల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జైలుకు వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు.

డీకే దూకుడు సిద్దకు నచ్చదని చెబుతారు. ఆయన పొడను కూడా ఆయన భరించలేరన్న మాట ఉంది. 2013లో తన ప్రభుత్వంలో డీకే శివకుమార్ కు మంత్రి పదవి ఇవ్వటానికి సైతం సిద్ద ససేమిరా అన్నట్లు చెబుతారు. అయితే.. ఈ పదేళ్ల కాలంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో పార్టీ దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డీకే శివకుమార్.. ఈ రోజున పార్టీ ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కర్త..కర్మ..క్రియ అన్నట్లుగా వ్యవహరించారని చెబుతారు.

సర్వేల్లో సిద్దరామయ్య వైపే ప్రజలు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన తొలిస్థానంలో ఉన్నారు. దీనికి తోడు ఇదే తనకు చివరి ఎన్నికలని.. ఆ తర్వాత తాను రాజకీయాల నుంచి బయటకువస్తానని చెప్పిన నేపథ్యంలో.. సిద్దకు పగ్గాలు ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్దరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే సామాజిక సమీకరణ కూడా సరిగా ఉంటుందని చెబుతున్నారు.

దీనికి తోడు 2013లో ఐదేళ్లు సీఎంగా చేసిన అనుభవం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మోడీషాల జోరుకు బ్రేకులు వేయాలంటే సిద్దరామయ్యకే పగ్గాలు ఇవ్వాలంటున్నారు. అయితే.. సిద్దకు మైనస్ పాయింట్లు లేవని కాదు. ఆయన్ను సీఎంను చేస్తే..తన సామాజిక వర్గమైన కురుబలకు పెద్ద పీట వేస్తారని.. పోస్టింగుల్లో వారికే అధిక ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు.

ఆయన తీరుతోనే కర్నాటకలో కీలకమైన వక్కలిగ.. లింగాయత్ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకతకు కారణం అవుతుందంటారు. క్రిమినల్ కేసులు ఉన్న పీఎఫ్ఐ.. ఎస్ డీపీఐ కార్యకర్తల్ని జైలు నుంచి విడుదల చేయటం కూడా ఆయన ప్రభ మసకబారేలా చేసింది. ఇక.. డీకే శివకుమార్ విషయానికి వస్తే.. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచింది ఆయనే. రాష్ట్రంలో అత్యంత సంపన్న రాజకీయ నేతగా ఆయనకు పేరుంది. దూకుడుకు మారుపేరుగా చెప్పే డీకే.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.

వక్కలిగ సామాజిక వర్గమైన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి అవసరమైన విరాళాల సేకరణలో కీలకభూమిక పోషిస్తారని చెబుతారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన ఏకైకస్థానం డీకే సోదరుడు గెలిచినదే కావటం గమనార్హం. డీకే శివకుమార్ బలం ఏమిటో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక్కటి సరిపోతుంది. బీజేపీ ఏలుబడిలో డీకే ఎదుర్కొన్న అవమానాలు..కష్టాలు.. దర్యాప్తు సంస్థల దాడులు అన్నిఇన్ని కావు. వాటిని ఎదుర్కొని మరీ తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చటంలో కీలకభూమిక పోషించారు. అయితే.. సీఎం పదవిని చేపట్టేందుకు ఆయనపైన ఉన్న కేసులు అడ్డంకిగా మారతాయన్న మాట ఉంది. ఇలాంటి వేళలో.. కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.