బాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్లే.. జగన్ ప్రచారం

కీలక వ్యాఖ్య ఒకటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతున్న ఆయన.. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. దత్తపుత్రుడు వస్తున్నారన్నారు. చంద్రబాబు స్క్రిప్టును డైలాగులుగా మార్చి ప్యాకేజీ స్టార్ ఒకవైపు.. బాబు.. దత్తపుత్రుడి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లో మీడియా తానా అంటే తందానా అంటుందన్నారు.

డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లను నేరుగా లబ్థిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్న జగన్.. ప్రతి పేదవాడికి తోడుగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్లేనని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి. వీళ్ల విధానం డీపీటీ.. అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో అంటూ జగన్ ఫైర్ అయ్యారు.

జీవీ రావు చార్టర్ అకౌంటెంట్ సర్వీస్ రద్దైందని.. ఇలాంటి దానయ్యకు కోటు తొడిగి.. ఆర్థిక నిపుణుడిగా చూపారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వద్దని.. దివాలా తీస్తుందని చెప్పిస్తారన్నారు. ‘రామోజీ పురుగులు పట్టిన బుర్రలోంచి ఇలాంటి వారు పుడతారు. చంద్రబాబు.. ఎల్లో మీడియా మనసులో మాటలను వీళ్లతో చెప్పిస్తారు. చంద్రబాబు.. ఎల్లో మీడియాది పెత్తందారీ మనస్తత్వం. వీళ్లు చేసే ప్రతి పని.. ప్రతి మాట.. ప్రతి రాతలోనూ మోసమే. పేదలందరికి ఇళ్లు ఇస్తుంటే వీళ్లందరికీ కడుపుమంట. ప్రశ్నిస్తామని చెప్పిన వారు ప్రశ్నించటమే మానేశారు’ అంటూ విరుచుకుపడ్డారు.

గడిచిన నాలుగేళ్లుగా రైతన్నల కోసం తాము చాలా చేశామని.. రైతుల్ని చంద్రబాబు గాలికి వొదిలేశారన్నారు. ‘చంద్రబాబు.. దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు. వారికి తోడుగా రావణ సైన్యం ఈనాడు.. ఆంధ్రజ్యోతి..టీవీ5 నిలిచాయి. రూ.87,617 కోట్లు మాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్తామని చెప్పి మోసం చేశారు’ అని బాబు అండ్ కోపై విరుచుకుపడ్డారు.

దేశంలో మరెక్కడా లేని రీతిలో ప్రతి గ్రామంలో భూసర్వే చేయిస్తున్నామని.. ఇప్పటికే రెండు వేల గ్రామాల్లో భూసర్వే చేపట్టినట్లు చెప్పారు. భూ హక్కుపత్రాలు వేగంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోందన్నారు రైతుల కష్టం తాను చూశానని చెప్పిన జగన్.. ‘రైతన్నల కష్టం నేను చూశాను. మీకు నేను ఉన్నాను. ఇప్పటికే గిరిజనులకు ఆర్వోఎఫ్ ఆర్ పట్టాల్ని పంపిణీ చేశాం. గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల సమస్యల్ని పరిష్కరించాం’ అని పేర్కొన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యల్ని చూస్తే.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? అన్న భావన కలిగేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.