పిఠాపురం ఈసారి టీడీపీదేనా ?

రాబోయే ఎన్నికల్లో పిఠాపురంలో గెలవబోయేది టీడీపీనే అని బల్లగుద్దకుండానే చెబుతున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ. వర్మ 2014లో ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిచారు. తర్వాత పరిణామాల్లో టీడీపీలోకి మారిపోయారు. గెలిచింది ఇండిపెండెంటుగానే అయినా టీడీపీ ఎంఎల్ఏగానే చెలామణి అయిపోయారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా టీడీపీ వర్మగానే నియోజకవర్గంలో గుర్తింపుపొందారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ పెండెం దొరబాబును ఓడించటం ఖాయమంటున్నారు. ఒకవేళ దొరబాబు స్ధానంలో ఇంకెవరు పోటీచేసినా గెలుపు మాత్రం తనదే అని గట్టిగా చెబుతున్నారు.

విచిత్రం ఏమిటంటే వర్మేమో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన నేత. నియోజకవర్గంలో మెజారిటి జనాలు, ఓటర్లేమో కాపులు. కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా గెలవటం గొప్పనే చెప్పాలి. ఇండిపెండెంటుగా పోటీచేసినా గెలిచారంటే కారణం ఏమిటంటే జనాల నేతగా పేరుండటమే. ఓడినా గెలిచినా ఎప్పుడూ జనాల్లో ఉండటమే వర్మకు పెద్ద ప్లస్ పాయింట్. ఇలాంటి వర్మ రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయబోయేది తానే అని చెబుతున్నారు.

అయితే ఇక్కడే వర్మ మాటలు అనుమానంగా ఉంది. ఎందుకంటే జనసేనతో గనుక పొత్తుంటే ఈ నియోజకవర్గంలో జనసేనే పోటీచేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పైగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. పోటీ చేసేది ఎవరైనా సీటు మాత్రం జనసేనదే అని ఆపార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఇక్కడే వర్మ మాటలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

టీడీపీ గెలుపు తర్వాత ముందు పోటీచేసేది ఏ పార్టీ ? అభ్యర్ధి ఎవరో తేల్చుకోమని వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు. ఈ పాయింటును కూడా ఆలోచించాల్సిందే. దొరబాబు స్ధానంలో కాపు నేతలు వంగాగీత కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ పోటీచేసే అవకాశాలున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. గీత సంగతి ఇప్పుడే చెపలేకపోయినా ముద్రగడ పోటీ చేస్తే మాత్రం పోటీ చాలా టైటుగా ఉంటుందనటంలో సందేహంలేదు. గీత ఇక్కడినుండి ప్రజారాజ్యం తరపున గెలిచారు పైగా నియోజకవర్గంలో గట్టి సంబంధాలున్న నేత కూడా. కాబట్టి వర్మ మాటలు ఎంతవరకు నిజమవుతాయనే విషయం తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.