కోట్లాది మాటల్ని ఈ ఫోటో ఒక్కటి చెబుతుంది?

పై ఫోటోను చూశారుగా. వందలాది మంది ఫ్రేములో ఉన్నా.. అందరి చూపు మాత్రం ఫోటో మొదట్లో పెద్దగా.. స్పష్టంగా కనిపించే ఆ వ్యక్తి వద్ద నిలిచిపోతాయి. నెత్తిన ఎర్రటి టవల్.. కళ్లకు నల్లటి కళ్లజోడు.. నల్లటి గడ్డంతో సీరియస్ గా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్నవ్యక్తి.. 29 ఏళ్ల తర్వాత.. తానే ముఖ్యఅతిధిగా రామజన్మభూమి అయిన అయోధ్యలో నిర్మించే రామాలయానికి భూమిపూజ చేస్తానని ఆ ఫోటోలోని నరేంద్ర మోడీ కూడా కలలో కూడా అనుకొని ఉండరేమో?

ఇంతకీ ఈ ఫోటో ఎప్పటిది? ఏ సందర్భంలో తీశారన్న విషయంలోకి వెళితే.. 1991లో ఢిల్లీలోన బోట్ క్లబ్ లో జరిగిన వీహెచ్ పీ ర్యాలీలో పాల్గొన్న సందర్భంలో తీసినది. రామజన్మభూమి అంశం దేశాన్ని కుదిపేసే వేళలో.. రామాలయ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు.. ఆందోళనలు.. రథయాత్రలు జరిగాయి. ఆ సందర్భంగా కోట్లాది మంది ప్రజలు భాగస్వామ్యం అయ్యారు. అందులో ఒకరు మోడీ.

అప్పట్లో ఆయన సంఘ్ కార్యకర్త మాత్రమే. కానీ.. తాను నమ్మిన సిద్దాంతం కోసం కమిట్ మెంట్ తో నిలిచిన ఆయన.. ఏళ్లకు ఏళ్లు పడిన కష్టానికి ఫలితంగా ప్రధానమంత్రి కావటమే కాదు.. తాను నడిచిన దారిని మరచిపోకుండా.. రామాలయ నిర్మాణాన్ని తన చేతుల్లోనే ప్రారంభించే అరుదైన అవకాశం మోడీకి మాత్రమే దక్కిందని చెప్పాలి. కష్టపడితే.. సామాన్యుడు సైతం అసమాన్యుడు కావటం ఖాయం. కాకుంటే.. అసమాన్యుడు కావటం కోసం పడే కష్టం ఎలాంటి ఫలితం ఇవ్వదన్న సత్యాన్ని మర్చిపోకూడదు.