మహారాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

బీఆర్ఎస్ అధినేత పక్కా ప్లానింగుతో ముందుకెళ్తున్నట్లుగా చెప్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఆయన తెలంగాణ బయట లోక్ సభ సీట్లు గెలవడం గ్యారంటీ అని.. అందుకోసం ఆయన ఇప్పటికే స్థానాలను ఎంపిక చేయడంతో పాటు అక్కడ అభ్యర్థులను కూడా గుర్తించారని, తెలంగాణకు చెందిన కొందరు నేతలను పొరుగు రాష్ట్రాలలో పోటీ చేయించబోతున్నారని తెలుస్తోంది. ఇక్కడి నేతలను పొరుగు రాష్ట్రాలలో పోటీ చేయించి అక్కడి నాయకుల సపోర్ట్ తీసుకునేలా, అక్కడి నాయకులకు కూడా ఆ మేరకు ఇతరత్రా ప్రయోజనాలు కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.

ముఖ్యంగా మహారాష్ట్ర లోక్‌సభ స్థానాల్లో ముగ్గురు తెలంగాణ నేతలను బరిలోకి దించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. వీరిలో అందరికంటే ముందున్న పేరు బీబీ పాటిల్. ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ మరాఠీ మూలాలున్న వ్యక్తి. ఆయన వ్యాపారాలు, కాంట్రాక్టులు కూడా మహారాష్ట్రలో ఉన్నట్లు చెప్తారు. ఆయనకు తెలుగు కంటే హిందీ, మరాఠీ బాగా వచ్చు. దాంతోపాటు ఉర్దూ కూడా ఆయన రావడమనేది మరో ప్లస్ పాయింట్. పాటిల్‌ను మహారాష్ట్రలో పోటీ చేయించడానికి కేసీఆర్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సమాచారం ఇవ్వడంతో పాటు రెండు విడతలుగా ఆయనతో చర్చించినట్లుగా కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

అలాగే.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ను కూడా మహారాష్ట్ర నుంచి పోటీ చేయించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన కూడా తెలుగు కంటే హిందీ, ఉర్దూ, మరాఠీలలోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆయన్ను నాందేడ్ లోక్ సభ సీటు నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే… షకీల్ మాత్రం కేసీఆర్ ప్రతిపాదనను తనకు అనుకూలంగా మార్చుకునేలా తన వైపు నుంచి ఓ ప్రతిపాదన పెట్టారని చెప్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తాను మహారాష్ట్రలో పోటీ చేస్తాను కానీ బోధన్ మాత్రం ఇతరులకు ఇవ్వకుండా తన భార్య అయేషాకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారట.
మరోవైపు కరీంనగర్‌కు చెందిన రవీందర్ సింగ్ పేరు కూడా నాందేడ్ జిల్లాలో పోటీ విషయంలో పరిశీలనలో ఉన్నట్లు చెప్తున్నారు. నాందేడ్‌లో సిక్కుల సంఖ్య ఎక్కువగా ఉండడం.. అదే సమయంలో కరీంనగర్, ఇతర తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్లి స్థిరపడినవారు ఉండడం… ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ ఉండడంతో సిక్కు నేతలతో ప్రచారం చేయించి లాభపడొచ్చన్న ఆలోచనతో కేసీఆర్ రవీందర్ సింగ్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు.

ఏపీలో ఎన్నికల నాటికి అక్కడి పార్టీలు తమతో వ్యవహరించే వైఖరిని బట్టి ఎక్కడెక్కడ పోటీ చేయాలి.. ఒంటరిగా పోటీ చేయాలా.. ఎవరితో కలిసి పోటీ చేయాలి.. ఎవరిని బరిలో దించాలనేది నిర్ణయించుకోనున్నట్లు తెలుస్తోంది.

ఒడిశా విషయంలో స్థానిక అభ్యర్థులనే బరిలో దించే ఆలోచనలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేడీలో ఉంటూ చాలా కాలంగా టికెట్లు దొరకని ద్వితీయ శ్రేణి తెలుగు నేతలను ఆకర్షించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. నవరంగ్‌పూర్, కొరాపుట్, బరంపూర్ లోక్ సభ నియోజకవర్గాలలో అలాంటి నేతలపై బీఆర్ఎస్ దృష్టిపెట్టింది.