దానం నాగేందర్ కు షాక్ తప్పదా ?

అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ప్లానింగ్ తుది దశకు చేరుకుంది. కొన్ని చోట్ల సిట్టింగుల వైపే మొగ్గు చూపుతున్న పార్టీ అధినేత కేసీఆర్ మరికొన్ని చోట్ల మాత్రం వారికి ఝలక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇటీవలే పార్టీ మీటింగులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సిట్టింగుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారని వారిని సహించేది లేదని కేసీఆర్ తేల్చేశారు. పద్ధతి మార్చుకోకపోతే టికెట్ దక్కదని హెచ్చరించారు.

కేసీఆర్ పునరాలోచనలో ఉన్న నియోజకవర్గాల్లో హైదరాబాద్ సిటీలోని ఖైరతాబాద్ కూడా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖైరతాబాద్ అభివృద్ధిపై నాగేందర్ అసలు దృష్టి పెట్టలేదని కేసీఆర్ కు రిపోర్టులు అందాయట. పండుగలకు, పబ్బాలకు వచ్చి జెండాలు ఎగురవేయడం, స్వీట్స్ పంచడం, స్లమ్స్ లో జనానికి కాసిని డబ్బులు పంచడం మినహా మౌలిక సదుపాయుల అభివృద్దికి, ఇతర పనులపై నాగేందర్ ఎలాంటి చొరవ తీసుకోలేదని అంటున్నారు

గత ఎన్నికల్లో ఖైరతాబాద్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి తర్వాతి కాలంలో బీజేపీ చేరి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న దాసోజు శ్రవణ్ కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. దాసోజు శ్రవణ్ మంచి వక్తే కాకుండా ఖైరతాబాద్ సమస్యలు, వాటి పరిష్కారాలు కూడా ఆయనకు తెలుసని కేసీఆర్ కు నివేదికలు అందడంతో గులాబీ బాస్ ఆయన వైపు దృష్టి పెట్టారు.

నిజానికి శ్రవణ్ కు తొలుత ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నారు. అయితే తర్వాత మనసు మార్చుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకుంటున్నారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శ్రవణ్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే దానం నాగేందర్ కు కష్టకాలం తప్పకపోవచ్చు…