జూనియర్ ఎన్టీఆర్‌పై లోకేష్ కామెంట్ వైరల్

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి, నారా కుటుంబాలు వ్యవహరించే తీరు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుంటుంది. హరికృష్ణ రెండో భార్య కొడుకైన తారక్‌ను మొదట్లో ఈ రెండు కుటుంబాలూ దూరంగానే పెట్టినట్లు కనిపించేది. కానీ తర్వాత అతను అందరికీ దగ్గరయ్యాడు. ఇటు బాలయ్యతో, అటు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగాడు. 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో కొంత కాలం క్రియాశీలంగా వ్యవహరించాడు. పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాడు. కానీ ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి, తదనంత పరిణామాలతో జూనియర్.. బాలయ్యకు, బాబుకు దూరం అయిపోయాడు. కొన్నేళ్ల నుంచి ఆ ఇద్దరితోనూ అంటీముట్టనట్లే ఉంటున్నాడు.

ఐతే ఎప్పటికైనా తారక్.. రాజకీయాల్లోకి వస్తాడని, తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడతాడని అతడి అభిమానులు అంటుంటారు. పనిగట్టుకుని అతణ్ని తొక్కడానికి బాలయ్య, బాబు ప్రయత్నిస్తారని కూడా ఆరోపిస్తుంటారు.

నారా లోకేష్‌కు రాజకీయంగా ఇమేజ్ పెంచడానికి, భవిష్యత్తులో అతడికే పార్టీ పగ్గాలు ఇవ్వడానికే జూనియర్‌ను దూరం పెడుతున్నారనే భావన అతడి అభిమానుల్లోనే కాక చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో సందర్భం వచ్చినపుడు తారక్ విషయంలో నారా లోకేష్ ఏం మాట్లాడతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు.

కానీ ఇటీవల యువగళం యాత్రలో భాగంగా తారక్ ప్రస్తావన వస్తే.. అతను తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని, స్వాగతిస్తానని.. రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలనే కామెంట్ చేసి ఆశ్చర్యపరిచాడు లోకేష్. తాజాగా మరోసారి అతను తారక్ గురించి సానుకూల వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. యువగళం యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో ఒక హోటల్‌కు వెళ్లిన తారక్‌కు.. అక్కడ ఎటు చూసినా తారక్ ఫొటోలే కనిపించడం చూసి.. ‘‘అన్నీ మా వాడి ఫొటోలేగా’’ అని వ్యాఖ్యానించాడు. తారక్‌ను చూసి ఇన్‌సెక్యూర్ ఫీల్ కాకుండా ఇలా పాజిటివ్ కామెంట్ చేయడం పట్ల లోకేష్‌ను అందరూ అభినందిస్తున్నారు.