ఇక‌, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ దూకుడు.. ఢిల్లీకి కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. గురువారం ఆయ‌న ఢిల్లీకి చేరుకుని ఇక్క‌డ నిర్మించిన బీఆర్ ఎస్ జాతీయ భ‌వ‌నాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు క‌దుపుతున్న కేసీఆర్ దీనికి అనుగుణంగా ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయ భవనాన్ని నిర్మించారు. ఇందుకోసం సీఎం గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్(బీఆర్ఎస్ కార్యాలయం)ను ప్రారంభిస్తారు. తొలుత కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు. అనంతరం ఒంటి గంటా 5 నిమిషాలకు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఒకటిన్నర వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయంలో గడుపుతారు. ఈ కార్యక్రమం కోసం కేసీఆర్‌ గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి రహదారులు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పర్యవేక్షించారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఎక్క‌డ నిర్మించారు?

ఢిల్లీలోని కీల‌క‌మైన వసంత్‌ విహార్ ప్రాంతంలో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి 2020 అక్టోబరు 9న కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ 1315 గజాల స్థలం కేటాయించింది. ఆ స్థలానికి బీఆర్ఎస్.. మార్కెట్‌ విలువ ప్రకారం 8కోట్ల 41లక్షల 37వేల 500, వార్షిక స్థల అద్దె కింద 21లక్షల 3వేల 438 రూపాయాలు చెల్లించింది. అనంతరం ఆ స్థలంలో ఉన్న చిన్నపాటి కొండను తొలగించి కార్యాలయ నిర్మాణానికి అనువుగా మార్చింది. కేసీఆర్ దీని నిర్మాణానికి 2021 సెప్టెంబరు 2న భూమి పూజ చేశారు.

నిర్మాణ పనులను ఎండీపీ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించారు. రెండేళ్లలోపే కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని జీ+4 అంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సమావేశ మందిరం, క్యాంటీన్‌, మూడో అంతస్తులో పార్టీ అధ్యక్షుని ఛాంబర్‌ ఏర్పాటు చేశారు. అతిథుల కోసం పైఅంతస్తులో ప్రత్యేక గదులు నిర్మించారు. కార్యాలయంలో మొత్తం 14 గదులు ఉన్నాయి.