పోకర్ టోర్నమెంట్ ఉందంటే థాయ్ లాండ్ కు వెళ్ళా!

అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చీకోటీ ప్రవీణ్ వార్తల్లోకి రావటం తెలిసిందే. గత ఏడాది ఈడీ సోదాలతో అతడి పేరు మొదటిసారిగా మీడియాలో ప్రముఖంగా రావటం.. ఆ తర్వాత అతగాడి విలాసవంతమైన జీవితం గురించి.. అతడి క్యాసినో వ్యాపారం మీద బోలెడన్ని కథనాలు వచ్చాయి. అయితే.. గ్యాంబ్లింగ్ ను చట్టవిరుద్దమైన చర్యగా చూసే థాయ్ లాండ్ లో భారీ ఎత్తున నిర్వహించిన ఉదంతంలో థాయ్ పోలీసులు అతన్ని.. అతను తీసుకొచ్చిన వంద (దగ్గర దగ్గర) మందిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

పోలీసులకు పట్టుబడిన వారిలో 84 మంది తెలుగు వారు ఉన్నారు. తాజాగా వారిని కోర్టుకు హాజరు పర్చగా.. వారికి వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. వారి వీసాల్ని రద్దు చేసి భారతదేశానికి తిరిగి పంపించేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. దీంతో.. అరెస్టు అయిన వారి కుటుంబాలకు చెందిన వారు ఊపిరి పీల్చుకున్నారు. సరదా ట్రిప్ కోసం వెళ్లిన వారు.. ఎప్పుడు తిరిగి వస్తారన్న ఆందోళన వ్యక్తమైన వేళ.. రెండు రోజుల వ్యవధిలో విషయం ఒక కొలిక్కి వచ్చి.. వచ్చేస్తున్న వైనంతో ఆనందంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. కోర్టులో బెయిల్ పొందిన తర్వాత చీకోటీ ప్రవీణ్ ను థాయ్ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. దీనికి ఆయన మాట్లాడుతూ.. తాను గ్యాంబ్లింగ్ నిర్వాహకుడ్ని కాదని.. తనకు ఎలాంటి శిక్ష పడలేదని పేర్కొన్నాడు. తాను హాల్లోకి వెళ్లిన పది నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చినట్లుగా స్పష్టం చేశారు. అందుకే.. తనను పోలీసులు ఫైన్ తో వదిలేసినట్లుగా పేర్కొన్నారు.

తనకు నాలుగు రోజులు పోకర్ టోర్నమెంట్ ఉందంటే థాయ్ లాండ్ కు వచ్చానని.. దివిజేశ్.. సిత్రనన్.. ఏక్ లు తనను ఆహ్వానిస్తేనే వచ్చానని.. తనకు పోకర్ మీద థాయ్ లాండ్ లో బ్యాన్ ఉందన్న విషయం తెలీదని పేర్కొన్నారు. ఇంత భారీగా క్యాసినో వ్యాపారం చేసే ప్రవీణ్ కు.. ఏ దేశంలో గ్యాంబ్లింగ్ కు అనుమతులు ఉన్నాయి? ఎక్కడ లేవు? అన్నది తెలీదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.