కేసీయార్ కు షాకిచ్చిన ఈడీ

కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఉత్సాహం కేసీయార్ లో 24 గంటలు కూడా నిలవలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసీయార్ కూతురు కవిత, అల్లుడు అనిల్ పాత్రలను చార్జిషీట్లో స్పష్టంగా చెప్పటం ద్వారా కేసీయార్ కు పెద్ద షాకే ఇచ్చింది. మొన్నటివరకు కవిత పేరు తప్ప ఆమె భర్త అనీల్ పేరు ఎక్కడా వినబడలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన సౌత్ గ్రూప్ లో కవితే కీలకమని ఈడీ తాజా చార్జిషీటులో పదేదపదే ప్రస్తావించింది.

ఇప్పటికే కవితను ఈడీ మూడుసార్లు విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే కవిత అరెస్టవుతుందని అనుకున్నా ఎందువల్లో ఈడీ అరెస్టు చేయలేదు. అలాంటిది తాజా ఛార్జిషీటులో భర్త అనిల్ పేరుకూడా ఉండటమే షాకింగ్ గా ఉంది. సౌత్ గ్రూప్ నుండి హవాలా మార్గంలో ఆప్ కు రు. 100 కోట్లు అందినట్లు ఈడీ చెప్పింది. సౌత్ గ్రూప్ లో కీలకమైన కవిత తరపున అరుణ్ రామచంద్రపిళ్ళై ప్రతినిధిగా వ్యవహరించారట. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతోనే సౌత్ గ్రూప్ హైదరాబాద్ లో భారీ ఎత్తున భూములు కొన్నట్లు కూడా ఈడీ చెప్పింది.

ఫీనిక్స్ అనే కంపెనీ పేరుతోనే భూములు కొన్నట్లు కూడా వివరించింది. బహుశా ఫీనిక్స్ కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలోనే కవిత భర్త అనీల్ పాత్రను ఈడీ వివరించినట్లుంది. కవిత భూములు కొనుగోలు చేసిన విధానాన్ని కూడా ఈడీ వివరించింది. మార్కెట్ ధర అడుగుకు రు. 1760 అయితే డిస్కౌంట్ ధరపై కవిత రు. 1260 కే కొన్నారట. ఎంగ్రోత్ అనే సంస్ధలో భర్త అనీల్ భాగస్వామట. ఫీనిక్స్+ఎంగ్రోత్ సంస్ధల ద్వారానే భూములు కొన్నట్లు చెప్పింది.

కవిత ముఖ్యమంత్రి కూతురు కాబట్టే భూములను చౌకగా కొనుగోలు చేసినట్లు కూడా ఈడీ ఆరోపించింది. వాళ్ళదగ్గరున్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకే పెద్దఎత్తున కవిత అండ్ కో భూములు కొన్నట్లు ఈడీ ఛార్జిషీట్లో ఆరోపణలు గుప్పించింది. అలాగే తన ఆరోపణలకు ఆధారాలను కూడా చూపించింది. మొత్తంమీద సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఉత్సాహం కేసీయార్లో నిలవకుండా చేసేసింది.