సీనియర్లు పోటీకి భయపడుతున్నారా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయటానికి కాంగ్రెస్ సీనియర్లలో కొందరు భయపడుతున్నారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వయసు అయిపోవటం, రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోవటం, ఖర్చులకు భయపడటంతో పాటు వారసులు రంగంలోకి దిగాలని ఉత్సాహం చూపుతుండటమేనట. రాబోయే ఎన్నికల్లో గెలుపు సంగతిని పక్కన పెట్టేస్తే అసలు పోటీ చేయాలంటేనే డబ్బు ఏ స్ధాయిలో ఖర్చు చేయాలో అని భయపడుతున్నారు.

డబ్బులు ఖర్చు చేయటం పెద్ద విషయం కాకపోయినా మూడో ఎన్నికలో కూడా ఓడి పోతే బాగుండదని అనుకుంటున్నారట. ఎలాగూ వారసులు పోటీ చేయాలని బాగా ఉత్సాహం చూపుతున్నారు. కాబట్టి వారసులకు దారి చ్చేస్తే తాము విశ్రాంతి తీసుకున్నట్లవుతుంది, యువత హోదాలో వారసులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయంగా ఉందని ఆమధ్య నల్డొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న విషయం గుర్తుండే ఉంటుంది.

పరిస్ధితులన్నీ అనుకూలిస్తే వచ్చేఎన్నికల్లో రేణుకాచౌదరి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, గీతారెడ్డి, జానారెడ్డి, సుదర్శనరెడ్డి వారుసలను పోటీకి దింపినా ఆశ్చర్యపోవక్కర్లేదట. ఇప్పటికే రేణుకా చౌదరి ఏపీలోని విజయవాడ పార్లమెంటు స్ధానంలో పోటీచేయటానికి ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చులు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. మొన్ననే జరిగిన మునుగోడు ఉపఎన్నిక ఖర్చును అందరు చూసిందే. ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే బాగా డబ్బున్న వాళ్ళు కూడా భయపడేట్లుగా తయారైంది పరిస్దితి.

మునుగోడులో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధులు పోటీపడి మరీ ఖర్చులు చేసినట్లు ప్రచారం తెలిసిందే. ఇద్దరు కలిసి సుమారు రు. 600 కోట్లు ఖర్చు చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకవైపు అధికార పార్టీ మరోవైపు బీజేపీ తరపున వేలకోట్ల వ్యాపారాలు చేసే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి గెలుపు ప్రతిష్టగా మారటంతో ఖర్చుకు ఎవరు వెనకాడలేదు. రేపటి ఎన్నికల్లో అన్నీచోట్లా మునుగోడులో చేసినట్లు ఖర్చులు సాధ్యంకాదు. అయితే ఖర్చు విషయంలో మునుగోడు ఉపఎన్నిక ఒక బెంచ్ మార్కయిపోయింది. పైగా కాంగ్రెస్ నేతలు పదేళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉండటంతో చాలామంది ఖర్చులను తట్టుకునే స్ధితిలో లేరట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.