జేసీ బ్ర‌ద‌ర్స్ గ్రాఫ్ పెరిగిన‌ట్టేనా…?

అనంత‌పురం జిల్లా నుంచి అనేక మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. ఎవ‌రి పేరు చెప్ప‌గానే.. రాజ‌కీయంగా చ‌ర్చ వ‌స్తుందో.. ఎవ‌రి పేరు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌కు స‌వాళ్ల‌కు ప్ర‌తిస‌వాళ్ల‌కు కేరాఫో.. వారే జేసీ బ్ర‌ద ర్స్‌. అనంత‌పురం రాజ‌కీయాల్లో వీరు చాలా ప్ర‌త్యేకం. గ‌త ఏడాది చేసిన ప్ర‌యోగం విక‌టించింది. జేసీ దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్రెడ్డిలు ఇద్ద‌రూ త‌ప్పుకొని త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇది రాంగ్ స్టెప్‌గా మారిపోయింది.

40 ఏళ్ల అప్ర‌తిహ‌త హ‌వాను వైసీపీ వ‌చ్చి కొట్టేసింది. పోతే పోనీలే అనుకుందామ‌ని భావించినా.. కంట్లో న‌లుసుగా.. జేసీ బ్ర‌ద‌ర్స్‌ను రాజ‌కీయాలు కుమ్మేస్తున్నాయి. టీడీపీ నేత‌లు కాలు బ‌య‌ట‌కు పెట్టాలంటే.. ఆలోచించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో టీడీపీ కేడ‌ర్‌లో నైరాశ్యం ఏర్ప‌డింది. మ‌రి ఈ ప‌రిస్థితిని ఇప్పుడు మార్చ‌క‌పోతే.. ఎలా అనుకున్న జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి కాలు దువ్వుతున్నారు. తాడిప‌త్రి కౌన్సిల్ ఎన్నిక‌ల నుంచి ఈ దూకుడు మ‌రింత పెరిగింది.

ఇక‌, రెండు రోజుల కింద‌.. మ‌రింత హ‌ల్చ‌ల్ చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్ర‌మాల‌ను వెలుగులోకి తెస్తున్నాన‌ని.. పేర్కొంటూ ఆయ‌న హ‌ల్చ‌ల్ చేశారు.ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే.. ప్ర‌భాక‌ర్‌రెడ్డి గ్రాఫ్ అయితే పుంజుకుంద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి జేసీ ప్ర‌భాక‌ర్ నిల‌బ‌డితే.. ఈ సారి వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రోవైపు దివాక‌ర్‌రెడ్డి ప‌రిస్థితి ఏంటి? అంటే.. రాజ‌కీయంగా ఆయ‌న దూరంగా ఉన్నారు. అయితే, రాజ్య‌సభ సీటు కోసం.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స్నేహ పూర్వ‌క‌ సంబంధాలున్న‌.. జేసీ దివాక‌ర్‌రెడ్డి.. ఇప్పుడు కొత్త‌గా రాయ‌ల తెలంగాణ నినాదం అందుకున్నారు. ఇది కేసీఆర్‌కు క‌లిసి వ‌చ్చే అంశం. రాయ‌ల తెలంగాణ‌కు కేసీఆర్ ఓకే అంటే.. సీమ‌లోని ఇత‌ర వ‌ర్గాలు కూడా.. ఆయ‌న కు మద్ద‌తుగా నిలిచే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే దివాక‌ర్ కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా వ్యాఖ్యానించారు. అంటే.. రేపు కేసీఆర్‌ను మ‌చ్చిక చేసుకున్నా.. ఆశ్చ‌ర్యం లేదు. మొత్తంగా చూస్తే.. జేసీ బ్ర‌దర్స్ హ‌వాలో కొంత మార్పు క‌నిపించిన‌ప్ప‌టికీ.. అదే దూకుడు మాత్రం కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.