కేసీఆర్ దిల్లీ టూర్.. వారం రోజులు మకాం అక్కడే

తెలంగాణ సీఎం కేసీఆర్ మే మొదటి వారమంతా దిల్లీలోనే ఉండేందుకు నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని వివిధ పార్టీల నాయకులు, మేధావులతో సమావేశం కాబోతున్నారు. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్‌ దేశంలోని ఏఏ రాష్ట్రాలలో పోటీ చేయబోతోంది.. ఏఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోబోతోంది వంటి అన్ని విషయాలలో ఈ పర్యటనతో కొంత స్పష్టత రానుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేసిన తర్వాత మే 2 సాయంత్రం కేసీఆర్ దిల్లీ వెళ్తారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. మే 2 నుంచి మే 8 వరకు కేసీఆర్ దిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దిల్లీలోని వసంత విహార్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం పూర్తికావడంతో మే 4న కేసీఆర్ దాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ స్టేట్ లీడర్లు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లోనూ దీనిపై సూచనప్రాయంగా సమాచారం ఇచ్చారు. పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత కేసీఆర్ వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో నాలుగైదు రోజుల పాటు చర్చలు జరపనున్నట్లు సమాచారం.

కాగా తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల బృందం ఇప్పటికే దిల్లీ చేరుకుని అక్కడ వ్యవహారాలు చూస్తోంది. కేసీఆర్ ప్రారంభించనున్న ఆఫీసు దగ్గర భద్రత, ఇతర వ్యవహారాలపైనా వారు కన్నేశారు. నిరుడు డిసెంబరు 15న సర్దార్ పటేల్ రోడ్డులో తాత్కాలిక పార్టీ ఆఫీసును ఓపెన్ చేసిన తర్వాత కేసీఆర్ వెళ్ళడం ఇదే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జాతీయ కార్యకలాపాలన్నీ దిల్లీ సెంట్రల్ ఆఫీసు కేంద్రంగానే ఉంటాయని కేసీఆర్ ప్రకటించినా దాదాపు ఐదు నెలల పాటు ఎలాంటి యాక్టివిటీస్ జరగలేదు. టెంపరరీ ఆఫీసు లీజు ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఉన్నందున అప్పటికల్లా సొంత ఆఫీసులో అన్ని ఏర్పాట్లు సిద్ధం కానున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల చుట్టూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోతైన విశ్లేషణలు చేస్తున్న నేపథ్యంలో అక్కడి ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ యాక్టివిటీస్‌ను కూడా ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

మహారాష్ట్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టి పదుల సంఖ్యలో నియోజకవర్గ స్థాయి లీడర్లను చేర్చుకుంటున్నందున ఇకపైన దిల్లీ కేంద్రంగా వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఏయే రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఏ స్థాయిలో విస్తరింపజేయాలి, పార్లమెంటు ఎన్నికల నాటికి జాయినింగ్ కార్యకలాపాలను ఉధృతం చేయడం, విజయావకాశాలు ఉన్న వ్యక్తులను గుర్తించి ఆయా స్థానాల్లో వారిని నిలబెట్టడం తదితరాలన్నింటిని సెంట్రల్ ఆఫీసు వేదికగానే నిర్ణయాలు జరగనున్నాయి.

కాగా కేసీఆర్ తన తాజా పర్యటనలో కాంగ్రెస్ సీనియర్లతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో కొన్ని రహస్య భేటీలూ ఉండబోతున్నాయని.. ఇప్పటికే అపాయింట్‌మెంట్లు ఫిక్సయ్యాయని తెలుస్తోంది. బీజేపీలో కేంద్రంలో మంత్రిగా పనిచేసిన దిల్లీకి చెందిన ఓ నేతతో కేసీఆర్ భేటీ కానున్నారని తెలుస్తోంది. సమాజ్ వాది పార్టీ, ఆర్జేడీ నేతలతోనూ భేటీలు ఉంటాయి. మరోవైపు లిక్కర్ కేసులో కవితను బయటకు తీసుకొచ్చేందుకూ కేసీఆర్ చక్రం తిప్పొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలైతే… కవిత కోసం బీజేపీ కాళ్లపై పడేందుకే కేసీఆర్ దిల్లీ వెళ్తున్నారని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.