జగన్ టీమ్ లో గంగిరెడ్డి టెన్షన్

ఏపీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కావడంతో జగన్ వర్గంలో కొత్త టెన్షన్ పట్టుకుందన్న చర్చ మొదలైంది. దాదాపు మూడు సంవత్సరాలుగా బయట తిరుగుతున్న గంగిరెడ్డి ఇప్పుడు సరెండర్ అయితే సీబీఐకి ఎలాంటి సమాచారం ఇస్తాడోనని ఒక వర్గం భయపడుతున్నట్లు చెబుతున్నారు. మిగతావారిని, గంగిరెడ్డిని ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడితే హత్య జరిగిన తీరు మొత్తం బయటకు వస్తుందని సీబీఐ విశ్వసిస్తోందట. పైగా ఇప్పుడు అనుమానితులు, సాక్ష్యుల సంఖ్య పెరగడంతో ఎక్కడోక్కడ లింకు దొరుకుతుందని నమ్ముతున్నారు.

2019 మార్చి 15న వివేకా హత్య జరగ్గా. అదే ఏడాది మార్చి 28న గంగిరెడ్డిని అరెస్టు చేశారు. 90 రోజుల్లోపు ఛార్జ్ షీటు వేయలేదన్న సాకు చూపి గంగిరెడ్డి 2019 జూన్ 27న బెయిల్ పొందారు. గంగిరెడ్డి బయట తిరుగుతూ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, సాక్ష్యాలను మటుమాయం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దానితో ఆయన బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుదీర్ఘ విచారణ తర్వాత గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు మే 5లోపు ఆయన లొంగిపోవాలని ఆదేశించింది. జూన్ 30 వరకు గంగిరెడ్డిని అదుపులో ఉంచుకోవచ్చని, జూలై 1న మళ్లీ బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుందని ఈ లోపే గంగిరెడ్డి దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది.

ఈ రెండు నెలల మెలిక ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నప్పటికీ ఐపీసీ ప్రకారం అది కరెక్టేనన్న వాదన కూడా వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం, సూత్రధారులను బయటకు తీసుకురావడం లాంటి చర్యలకు గంగిరెడ్డి ఇంటరాగేషన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సీఎం జగన్ పీఏ, సీఎం సతీమణి భారతీ రెడ్డి సహాయకుడిని కూడా సీబీఐ ప్రశ్నించిన నేపథ్యంలోనే గంగిరెడ్డి ఏం చెబుతారనేది కూడా ఉత్కంఠకు కారణమవుతోంది. ఈ లోపే సీబీఐ వేరు కోణాల్లో కూడా విచారణ మొదలు పెట్టింది.

వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ స్టేట్ మెంట్ ను రెండు సార్లు రికార్డు చేయడం ద్వారా మరింత సమాచారం రాబట్టింది. తాజాగా మరికొందరు అనుమానితులకు నోటీసులు ఇచ్చిన సీబీఐ వారిని గంగిరెడ్డి ముందు కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. వైఎస్ వివేకా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ఇనయతుల్లాను , ప్రస్తుతం జైల్లో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డిలను సీబీఐ మరోసారి ప్రశ్నిస్తోంది. వివేకా హత్యకు ఇనయతుల్లా ప్రత్యక్ష సాక్షిగా ఉండటంతో పాటు మాజీ మంత్రి మృతదాహాన్ని బాత్ రూమ్ నుంచి ఈడ్చుకు వచ్చారని చెబుతున్నారు. హత్య కేసుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి లింకు ఏమిటో ఈసారైనా ఖచితంగా బయటకు వస్తుందో రాదో చూడాలి…