తన మిత్రుడుకి 22 అంతస్తుల బిల్డింగ్ బహుమతి ఇచ్చిన అంబానీ

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన చిరాకాల మిత్రుడు మోదీకి ముంబయిలో రూ. 1500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల భవనాన్ని కానుకగా ఇచ్చారు. అయితే, అంబానీ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ అందుకుంటున్న ఈ మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కాదు.. మనోజ్ మోదీ. అవును.. 40 ఏళ్లుగా రిలయన్స్‌లో పనిచేస్తున్న మనోజ్ మోదీ.
మనోజ్ మోదీకి దక్షిణ ముంబయిలోని నేపియన్ సీ రోడ్‌లో ఉన్న 22 అంతస్తుల బృందావన్ అపార్టుమెంట్‌ను అంబానీ గిఫ్ట్ ఇచ్చారు.

దాని విలువ రూ. 1500 కోట్లు. ముంబయిలోని అత్యంత కాస్ట్లీ ఏరియాల్లో నేపియన్ సీ రోడ్ కూడా ఒకటి. ఇక్కడున్న బృందావన్ అపార్ట్‌మెంట్లో మొదటి 7 అంతస్తులను కేవలం పార్కింగ్ కోసమే ఉంచారు. మొత్తం ఇందులో 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్పేస్ ఉంది. ఒక్కో అంతస్తు 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంది. తలతీ పార్ట్‌నర్స్ కంపెనీ కట్టిన ఈ బిల్డింగ్‌కు ఇటలీ నుంచి చాలా సామగ్రి తీసుకొచ్చారు.

ఇంతకీ మనోజ్ మోదీకి ఇంత భారీ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారనే అనుమానం రావొచ్చు. రిలయన్స్ అంటే ముకేశ్ అంబానీ అనే అందరికీ తెలిసినా మనోజ్ మోదీ అనే మాస్టర్ మైండ్ ఒకటి దాని వెనుక ఉందని సాధారణ ప్రజల్లో చాలామందికి తెలియదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మనోజ్ మోడీ రైట్ హ్యాండ్. మనోజ్ మోదీ 1980లో రిలయన్స్‌లో జాయిన్ అయ్యారు. అప్పటికి ధీరూబాయి అంబానీ దానికి చైర్మన్.

ముంబయిలో చదువుకుంటున్నప్పటి నుంచి ముకేశ్, మనోజ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. రిలయన్స్ కుదర్చుకున్న వేల కోట్ల విలువైన ఎన్నో ఒప్పందాల వెనుక ఉన్న బుర్ర మనోజ్ మోదీదేనని చెప్తారు. అంతెందుకు 2020లో ఫేస్ బుక్‌తో జియో 43 వేల కోట్ల ఒప్పందం కుదరడం వెనుక ఉన్నదీ మనోజ్ మోదీయే.

దశాబ్దాల పాటు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలతో కలిసి పనిచేసిన మనోజ్ మోదీ ఇప్పుడు ముకేశ్ కుమారుడు ఆకాశ్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీలకు సపోర్టుగా అంతా చూసుకుంటున్నారు. అయితే.. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మనోజ్ మోదీ ఎక్కడా సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్‌లో కానీ కనిపించరు. తన పని తాను చేసుకుంటుంటారు. అందుకే.. ఇలా.. రిలయన్స్ అభివృద్ధి వెనుక నిత్యంతనతో ఉన్న మిత్రుడికి ముకేశ్ భారీ గిఫ్ట్ ఇచ్చారు.