సునీత విజయం సరే.. సామాన్యులకది సాధ్యమా…

వివేకానంద రెడ్డి కేసులో అందరూ ఊహించిందే జరిగి ఉండొచ్చు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. విచారణ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. అంటే తండ్రి భాస్కర్ రెడ్డి మాదిరిగానే అవినాశ్ కూడా అరెస్టయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి . అది ఆశావాదం మాత్రమే కాకుండా.. వాస్తవం కూడా. ఎందుకంటే నిందితుడిగా చేర్చిన వ్యకి అరెస్టు కావడానికి 99 శాతం ఛాన్సుంది.

అందరూ వదిలేసినా వివేకా కూతురు డాక్టర్ సునీత కేసును వదిలి పెట్టకుండా పోరాడారు. గట్టి పట్టుబట్టి కడప టు ఢిల్లీ వయా హైదరాబాద్ తిరిగి ఆమె చివరి దాకా పోరాడారు. అన్ని కోర్టు మెట్లు ఎక్కారు. కావాల్సిన డాక్యుమెంట్లు సేకరించి కోర్టుకు సమర్పించారు. అందుకే అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు కావడం సునీత విజయంగా చెబుతున్నారు. అదీ ఒక మహిళ, ఒక కూతురు విజయం అని కూడా అనక తప్పదు.

ఇప్పుడు అందరికీ తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే. ఇలాంటి హత్య ఒక సామాన్యుడి ఇంటిలో జరిగి ఉంటే సుప్రీం కోర్టు వరకు వెళ్లే సీన్ ఉంటుంది. అంత ధైర్యం ఉంటుందా. ఆర్థిక వనరులు ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుప్రీం కోర్టులో సోమవారం వాదనలు వినిపించిన వాళ్లు మామూలు న్యాయవాదులు కాదు. సిద్ధార్థ్ లూధ్రా, ముకుల్ రోహత్గీ లాంటి ఉద్దండులు ఈ కేసులో హాజరయ్యారు. వాళ్లు వాదిస్తుంటే జడ్జిలే వణికిపోయే పరిస్థితి ఉంటుంది.

సునీత కూడా ఈ కేసులో కోట్లు కాకపోయినా లక్షలు ఖర్చుపెట్టి ఉంటారు. ఎందుకంటే హాజరైన సీనియర్ న్యాయవాదులు గంటకు లక్షల తీసుకునే న్యాయవాదులు. మరి అంత ఫీజు చెల్లించి సుప్రీం కోర్టులో లాయర్ ను పెట్టుకునే స్తోమత అందరికీ ఉంటుందా.పైగా హై ప్రొఫైల్ కేసుల్లో వేగంగా విచారణ జరుగుతోందని సామాన్యుల కేసులైతే ఎన్ని సంవత్సరాలైనా బెంచ్ మీదకు రావడం లేదని కేసుల విచారణ తీరును బట్టి అర్థమవుతోంది. అదే మరి వీఐపీలకు, కామనర్లకు ఉన్న తేడా…