టీడీపీ సెల్ఫీల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

ఏపీలో రాజ‌కీయం అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకుంది. ఒక‌వైపు అధికార పార్టీ వైసీపీ.. ఇంటింటికీ స్టిక్క‌ర్ల పేరుతో ఈ నెల 7 నుంచి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది. ఇది ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ హుకుం జారీ చేశారు. ఇక‌, దీనికి పోటీగా టీడీపీ నాయ‌కులు కూడా యాంటీ స్టిక్క‌ర్ల యుద్ధం ప్రారంభించారు. అయితే.. ఇది వివాదాల‌కు తావిస్తుండ‌డంతో అనూహ్యంగా సెల్ఫీ యుద్ధం ప్రారంభించారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపు మేర‌కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నాయ‌కులు, శ్రేణులు.. సెల్ఫీల‌తో అద‌ర గొడుతున్నారు. ఎక్క‌డికక్క‌డ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రు లు.. నాయ‌కులు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. త‌మ హ‌యాంలో చేసిన అభివృద్ది, క‌ట్టిన క‌మ్యూనిటీ హాళ్లు.. వేసిన శిలా ఫ‌లకాల ముందు నిల‌బ‌డి సెల్పీలు తీసుకుంటున్నారు. త‌మ హ‌యాంలో వీటిని ఏర్పాటు చేశామ‌ని.. వైసీపీ ప్ర‌భు్త్వం వీటిని నిలిపేసింద‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ కీల‌క‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో రూపొందించిన కార్య‌క్ర‌మాల‌కు వైసీపీ గండికొట్టిందంటూ.. నాయ‌కులు.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు. మీ హ‌యాంలో ఇలాంటి కార్య‌క్ర‌మం ఒక్క‌టైనా జ‌రిగిందా? ఉంటే.. మీరు కూడా సెల్ఫీ తీసుకోండి-అంటూ టీడీపీ నాయ‌కులు రువ్వుతున్న స‌వాళ్ల‌తో వైసీపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నారు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌డంతో ఏం చేయాలో తెలియ‌డం లేదు.

ఇక‌, ఈ సెల్ఫీ ఛాలెంజ్‌కార్య‌క్ర‌మాన్ని డిజిట‌ల్ మాధ్య‌మాల్లోనూ టీడీపీ నాయ‌కులు ప్ర‌మోట్ చేస్తున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో రాజ‌కీయంగా ఈ కార్య‌క్ర‌మానికి మంచి ఊపు వ‌చ్చింది. నెటిజ‌న్లు ఎక్కువ‌గా దీనిని వీక్షిస్తూ.. త‌మ మ‌ద్ద‌తు తెలుపుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని చేసినా.. వైసీపీ అడ్డంగా బుక్క‌యింద‌నే వాద‌న వినిపిస్తోంది.