జగన్.. భారతిరెడ్డిలను విచారించాలట

రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించిన పరిణామాల గురించి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై టీడీపీ నేత పట్టాభి సంచలన డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని.. ఆయన సతీమణి భారతి రెడ్డిలను సీబీఐ విచారించాలన్న కొత్త డిమాండ్ ను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు.

వివేకా హత్యలో ఇప్పటివరకు విచారించిన వారంతా పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు మాత్రం జగన్ దంపతులేనని వ్యాఖ్యానించారు. వారిద్దరికి సీబీఐ నోటీసులు ఇచ్చి.. విచారణ చేయాల్సిందేనని కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ దంపతుల మీద.. వారి పాత్ర మీదా తొలి నుంచి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయన్న ఆయన.. అందులో కీలకమైన ప్రశ్నలకు సమాధానాన్ని రాబడితే సీబీఐ విచారణ ముగిసినట్లేనని చెప్పుకొచ్చారు పట్టాభి.

తాను చేసే తీవ్రమైన ఆరోపణలకు కాసిన్ని ఆధారాలు కూడా చూపించాల్సింది. అదేమీ లేకుండా ఇలా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసే ముందు.. అలా ఎందుకు చేయాలన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. దానికి సంబంధించిన ఆధారాల్ని కూడా ప్రస్తావిస్తే సరిపోయేది. అందుకు భిన్నంగా నాలుగు నోటి మాటల్ని చెప్పటంతో సరిపోదన్న విషయాన్ని పట్టాభి లాంటి నేతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.