సునీత పిటిష‌న్‌ లో జ‌గ‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈ 25 వ‌ర‌కు అరెస్టు చేయొద్దంటూ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ.. వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌లో ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ముఖ్యంగా ఏపీ సీఎం, త‌నకు అన్న వ‌రుస అయ్యే జ‌గ‌న్‌ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నం గా మారింది. 19.11.2021న అసెంబ్లీలో అవినాశ్ రెడ్డికి సీఎం జగన్ క్లీన్ చిట్ ఇచ్చారు. `ఒక క‌న్ను రెండో క‌న్నును పొడుచుకుంటుందా. నా త‌మ్ముడు త‌ప్పు చేస్తాడా అన్న జ‌గ‌న్‌ వ్యాఖ్య‌ల‌ను పిటిష‌న్‌లో పేర్కొన్నారు. జగనే నిందితునికి(అవినాష్‌) క్లీన్ చిట్ ఇవ్వడం అనుమానాలకు తావునిస్తోందని సునీత పేర్కొన్నారు.

అవినాష్‌ రెడ్డి పేరు బ‌య‌ట‌కు వచ్చిన తర్వాతే జగన్ యాక్టివ్ అయ్యారని తెలిపారు. ఛార్జిషీటులో అవినా ష్‌ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు రావడంతో అవినాష్ రెడ్డిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహా ప్రముఖులు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారని డాక్ట‌ర్‌. సునీత పిటిష‌న్ లో వివ‌రించారు.

19.11.2021న శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో సీబీఐ హాజరుపర్చినప్పుడు అవినాష్‌ రెడ్డి అక్కడకు వచ్చి అరగంట పాటు శివశంకర్ రెడ్డితో ఉన్నారు. శివశంకర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులను అవినాష్‌ బెదిరించారన్న విష‌యాన్ని కూడా సునీత త‌న పిటిష‌న్‌లో వివ‌రించారు.

అవినాష్‌ రెడ్డి, శివశంకర్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి గుడ్డిగా సమర్ధించార ని సునీత తెలిపారు. సీబీఐ పైనే నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ సునీత తన పిటిషన్ లో
వివ‌రించారు. సీబీఐ అధికారిపైనే కేసులు పెట్టించార‌ని.. ఈ కేసులో పెద్ద‌లు ఉన్నార‌న్న త‌న అనుమానాలు నిజం అవుతున్నాయ‌ని సునీత పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.