మళ్లీ వార్తల్లోకి నన్నపనేని రాజకుమారి

రాజకీయం అంటే అదో ఉత్సాహం, అదో ఆరాటం, ఖచితంగా చెప్పాలంటే అదో వ్యసనం. రాజకీయాలు అలవాటైన వాళ్లు అది మానుకోవడం చాలా కష్టం. రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పుకున్న వాళ్లే మళ్లీ వెనక్కి వస్తారు. మహతీర్ మహ్మద్ తన 94వ ఏటా మలి దఫా మలేషియా ప్రధాని అయ్యారు.. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఓ మాజీ మంత్రి రాజకీయాల్లో అంతర్ధానమై పోయారనుకుంటే ఆమె స్వయంగా పునరాగమనానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి..

ఎన్టీయార్ , తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తొలి తరం రాజకీయ నాయకుల్లో నన్నపనేని రాజకుమారి కూడా ఒకరు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 1983లో గెలిచిన రాజకుమారి తర్వాత నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో పనిచేశారు. కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నారు. టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా కూడా సేవలందించారు. ఆమెకు కాంగ్రెస్ నాయకురాలు గంగాభవానీకి మధ్య జరిగిన గొడవలు సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి తెలిసే ఉంటాయి.

రాజకుమారి రాజకీయాలకు దూరం కావడానికి అనేక కారణాలున్నాయి. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమె నీరసించిపోయారు. అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఏడు పదులు దాటిన రాజకుమారి స్వయంగా ప్రకటించారు. ఆర్థికంగా కూడా ఆమె చితికిపోయినట్లు చెబుతున్నారు..

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతున్న తరుణంలో నన్నపనేని పునరాలోచనలో పడట్టుగా ఆమెను ఎరిగిన వాళ్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని తెలిసిన తర్వాత ఆమె ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం ఇస్తే బావుండునని ఆమె అనుకుంటున్నారు. అందుకోసం ఆమె మళ్లీ జనంలోకి తిరిగేందుకు ప్రయత్నిస్తున్నారు వలస కార్మికుల బాధలు అర్థం చేసుకుని వాళ్ల కోసం పనిచేస్తున్నానని నన్నపనేని చెప్పుకుంటున్నారు. కార్మిక, కర్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడుతూ, వారికి సాయం అందిస్తూ పనిచేస్తున్నారు. పేద, అల్పాదాయ వర్గాలకు సాయం చేసేదీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాజకుమారి ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా టీడీపీ అధినాయకత్వం చల్లని చూపి ఆమెపై పడుతుందో లేదో చూడాలి..