జ‌గ‌న్ నుంచి వైఎస్ చ‌నిపోయి బ‌తికిపోయాడు : చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య ప్రపంచంలోని పోలీసులకు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు కూడా ఒక కేస్‌ స్టడీలాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు, త‌న వారిని త‌ప్పించేందుకు సీఎం జ‌గ‌న్ నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌ని కానీ న్యాయ వ్య‌వ‌స్థ నుంచి త‌ప్పించుకోలేర‌ని చెప్పారు. సొంత‌ చిన్నాన్నను గొడ్డలితో దారుణంగా నరికేసి శవానికి కుట్లు, బ్యాండేజీ వేసి బాక్సులో పెట్టి దహన క్రియలు చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.

శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, క‌డ‌ప‌ జిల్లాల పరిధిలోని ఐదు పార్లమెంటు నియోజకవర్గాల క్లస్టర్‌, బూత్‌స్థాయి సమీక్షలో చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వివేకా హత్యపై చంద్రబాబు విడ‌మ‌రిచి చెప్పారు. ‘తొలుత గుండెపోటుతో మరణించార‌ని ప్రచారం చేశారు. తర్వాత రక్తపు వాంతులతో చనిపోయాడన్నారు. పోస్టుమార్టం కోసం వివేకా కూతురు పట్టుబట్టడంతో ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ నాపైన కుట్రపన్ని రాజకీయ లబ్ధి పొందారు. అప్పట్లో రాష్ట్ర పోలీసులపై విచారణ నమ్మకం లేదన్నారు. సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. హత్యపై మాట్లాడకుండా కోర్టుకెళ్లి గ్యాంగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు.“ అని చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు.

సీఎం జ‌గ‌న్‌కు అధికారమే ముఖ్య‌మని, ఈ విష‌యంలో ఎవ‌రు అడ్డుగా ఉన్నా.. త‌ప్పించేస్తాడ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చివ‌ర‌కు త‌ల్లిని చెల్లిని కూడా త‌ప్పించార‌ని.. వైఎస్ చ‌నిపోయి బ‌తికిపోయాడ‌ని అన్నారు. “నాకు నాన్న లేడు.. చిన్నాన్న లేడు.. నేనొక్కడినే అంటూ అప్పటి ఎన్నికల్లో లబ్ధి పొందాడు” అని నిప్పులు చెరిగారు. హంతకులను కాపాడేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.

వ్యవస్థలను మేనేజ్‌చేసేందుకూ వెనుకాడడంలేదన్నారు. సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేస్తే ఆయన హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకోవలసి వచ్చిందని.. చివరకు సాక్షులను కూడా చంపేస్తున్నారని తెలిపారు. ధర్మం, న్యాయం కోసం తండ్రి ఆత్మశాంతి కోసం ఆడబిడ్డ సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి మనమందరం సంఘీభావం తెలపాలని పిలుపిచ్చారు. వివేకాను చంపిన వారిని పోలీసులు అరెస్టు చేస్తే కడపలో వైసీపీ నేతలు శాంతియుత ర్యాలీ చేయడం ఏమిటని ప్ర‌శ్నించారు.