గన్నవరం వచ్చిన స్పెషల్ ఫ్లైట్ లో ఎవరున్నారు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు కావటం తెలిసిందే. దీంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ అరెస్టు గురించి ఏ మాత్రం సమాచారం లేకుండా గుట్టుగా సాగినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ అరెస్టు అనంతరం కొన్ని గంటల వ్యవధిలో గన్నవరం ఎయిర్ పోర్టుకు మైసూర్ నుంచి వచ్చిన ఒక స్పెషల్ ఫ్లైట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ స్పెషల్ ఫ్లైట్ నుంచి వచ్చిన ముఖ్యులు.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన వారు సీఎం జగన్ తో సుదీర్ఘంగా ఎందుకు మంతనాలు జరిపినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ గన్నవరానికి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిందెవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది చూస్తే.. ఆసక్తికర సమాధానాలు లభిస్తున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేర్కొనే పారిశ్రామికవేత్త.. కృష్ణపట్నం పోర్టు ఎండీ గా పనిచేసిన చింతా శశిధర్‌ హుటాహుటిన మైసూర్ వెళ్లి.. కర్ణాటకలో జ్యోతిష్యుడిగా..లాబీ మాస్టర్ గా పేరున్న విజయ్ కుమార్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి వచ్చిన వారు.. సీఎం జగన్ నివాసానికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మొత్తం ముగ్గురు ప్రత్యేక విమానంలో వచ్చినట్లుగా తెలుస్తోంది.

జ్యోతిషుడిగా పేరున్న విజయ్ కుమార్ కు రాజకీయ.. న్యాయ ప్రముఖులతో మంచి రిలేషన్లు ఉన్నాయని.. లాబీ మాస్టర్ గా మంచి పేరుందని చెబుతున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన విషయాల మీదనే వీరి మధ్య చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్ తో సుదీర్ఘ సమావేశం ముగిసిన తర్వాత.. విజయకుమార్.. చింతా శశిధర్ మరో సహాయకుడు హైదరాబాద్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది.

జ్యోతిషుడైన విజయ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ బాగా పెద్దదని చెబుతున్నారు. జ్యోతిషం.. పూజల పేరుతో రాజకీయ నేతలు.. న్యాయవ్యవస్థలోని పలువురు ప్రముఖులతో ఆయనకు పరిచయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. తెర వెనుక విషయాల్ని చక్కబెట్టే విషయంలో ఆయనకు ఆయనే సాటిగా చెబుతారు.

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు సుప్రీంకోర్టులో అనేక మంది ప్రముఖులతో ఆయనకు జ్యోతిష.. పూజల సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇతర న్యాయప్రముఖులు తిరుమల.. శ్రీశైలం సందర్శించిన వేళలో వారి వెంట విజయకుమార్ ఉన్నారని.. అదీ ఆయన రేంజ్ అంటున్నారు.