మూడు రాజధానులపై ఆ సర్వేను గుర్తు చేస్తున్నారు


ఏపీలో మూడు రాజధానుల్ని నిర్మించేందుకు వీలుగా ఏపీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించటం.. తాజాగా ఆ బిల్లును గవర్నర్ ఓకే చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. అమరావతినే కొత్త రాజధాని అన్నోళ్లు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కొత్త రాజధాని అమరావతి అని ఫిక్స్ అయిన లక్షలాది మంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వారంతా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి.

రాష్ట్ర రాజధానికి దగ్గరగా వంద గజాల భూమి ఉన్నా.. భవిష్యత్తులో బాగుంటుందన్న ఉద్దేశంతో పెట్టుబడి పెట్టిన వారికి లెక్క లేదు. వారంతా ఇప్పుడు బోరుమంటున్నారు. ఇదిలా ఉంటే.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం విప్పిన వారు కొత్త ప్రచారానికి తెర తీస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే మూడు రాజధానులు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏపీ ప్రజల ఆమోదం లేదని.. ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మనసు మెచ్చిన ఫార్ములా అని.. దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదంటున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే ఉండాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నారు.

గతంలో అంటే జనవరి 21న ఇండియా టీవీ చానల్ కు చెందిన ట్విట్టర్ ఖాతాలో ఒక సర్వేను నిర్వహించారు. అందులో ఏపీలో మూడు రాజధానుల్ని మీరు అంగీకరిస్తున్నారా? లేదా? అన్న ప్రశ్నతో పాటు మరిన్ని నిర్వహించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మూడు రాజధానులు మంచివేనా? అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న వారిలో 67.4 శాతం మంది ఈ ఆలోచన ఎంతమాత్రం మంచిది కాదని తేల్చి చెప్పకగా.. 29 శాతం మంది మాత్రం మూడు రాజధానులకుమద్దతు ఇవ్వటం గమనార్హం. కేవలం నాలుగు శాతం మంది మాత్రం తాము ఏమీ చెప్పలేమని తేల్చారు.

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రజల మూడ్ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టం చేసిన వేళ.. మూడు రాజధానులపై ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడోచేసిన సర్వేను.. ఎప్పటికి అలానే ఉంటుందనుకోవటం సరికాదంటున్నారు.

అంతగా అయితే.. మరోసారి సర్వే చేస్తే సరిపోతుందే తప్పించి.. ఇలా పాతవి చూపించి అదే ప్రజాభిప్రాయం అన్న భావనను వినిపించటం గోబెల్స్ ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. తాజా సర్వే ఏ మీడియా సంస్థ చేస్తుందో చూడాలి.