పవన్ మాటలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి

Pawan Kalyan


ఐదేళ్ల కిందట అమరావతిలో రాజధాని కోసం తెలుగుదేశం ప్రభుత్వం భారీగా భూములు సమీకరిస్తుండటంపై వివాదం నెలకొన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత రైతులను కలిసేందుకు వెళ్లారు. అప్పుడు భూములిస్తున్న రైతులకు భరోసా ఏంటి అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారాయన.

తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయన మద్దతుదారే అయినప్పటికీ భూసేకరణ విషయంలో తప్పులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి రైతుల గోడు వింటూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు భూసేకరణ విషయంలో పవన్ అనవసర రాద్దాంతం చేస్తున్నాడని తెలుగుదేశం వాళ్లు విమర్శలు చేశారు. కొందరు రైతుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఆ రోజు పవన్ ఎంత ముందు చూపుతో మాట్లాడాడు అన్నది ఈ రోజు నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.

ఇంతకీ 2015 ఆగస్టు 23న అమరావతిలో రైతులనుద్దేశించి మాట్లాడుతూ పవన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.
‘‘అనేక వేలమంది రైతులు వాళ్ల నమ్మకాన్ని, వాళ్ల భవిష్యత్తుని, వారి పిల్లలు, తరాల భవిష్యత్తుని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని నమ్మి అమరావతిలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే.. కీడెంచి మేలెంచమంటాం కదా.. కాబట్టి తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే.. మంత్రి నారాయణ గారుండరు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారుండరు. భూములు ఇచ్చిన రైతులకు గ్యారెంటీ ఏంటి? భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసేందుకు రాజ్యాంగపరమైన భద్రత ఏముంటుంది?

నేనొక సినిమా తీసేటపుడు దాన్ని నమ్మి పెట్టుబడి పెట్టే అందరికీ జవాబుదారీగా ఉండాలి. నా సినిమా ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్లు ఇంటిదగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంత డబ్బు పెట్టాం ఏం చేశావ్ అని.. ఒక సినిమాకే నేను ఇంత జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉన్నపుడు.. ప్రభుత్వం ఇన్నివేల ఎకరాల భూముల్ని సేకరిస్తున్నపుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి? ఆ బాధ్యతను మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? శాసనాల ద్వారా ఇస్తేనే ఏదైనా ముందుకెళ్తుంది’’ అన్నాడు పవన్ ఆ రోజు. పవన్ ఏం ఆందోళన వ్యక్తం చేశాడో అదే ఇప్పుడు జరుగుతోంది. దీనిపై ఇటు టీడీపీ.. అటు వైసీపీ ఏమంటాయో?