‘ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటుహక్కు పెట్టుకోండి’

ఆంధ్రోళ్లు అంటూ అదే పనిగా విరుచుకుపడే మంత్రి హరీశ్ రావు అవసరానికి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడతారన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన ఉద్యమం నాటి నుంచి కూడా హరీశ్ మాటలు ఎప్పుడూ కూడా ఆంధ్రోళ్ల మనసుల్ని గాయపరిచేలా మాట్లాడారే తప్పించి.. ఎప్పుడూ కూడా చాలామంది ఉద్యమకారుల మాదిరి సంయమనంతో మాట్లాడింది లేదు. అలాంటి హరీశ్ ఇప్పుడు కొత్త మాటను పట్టుకున్నారు. తెలంగాణలో ఆంధ్రాకు చెందిన వారంతా ఏపీలో ఉన్న తమ ఓటుహక్కును రద్దు చేసుకొని.. తెలంగాణలో ఓటుహక్కు పెట్టుకోవాలన్న వ్యాఖ్య చేశారు.

హరీశ్ నోట ఇలాంటి మాట ఎందుకు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అక్కడితో ఆగని ఆయన.. ‘ఆంధ్రా.. తెలంగాణలో పాలన చూస్తున్నారు ఏది బాగుంది? తలెంగాణ అభివద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతిఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.కార్మికులు ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటు హక్కు పెట్టుకోండి’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

సంగారెడ్డిలోని తొమ్మిదో వార్డులో కార్మికుల భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా హరీశ్ నోటి నుంచి ఈ మాట వచ్చింది. మేడే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి కార్మికులు శుభవార్త వింటారన్న ఆయన.. జిల్లాలో రూ.2కోట్లతో రెండు ఎకరాల్లో కార్మికుల భవన నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. మరి.. హరీశ్ అన్నట్లు కార్మికులు మాత్రమే తమ ఓటు హక్కును మార్చుకోవాలా? తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు మొత్తం మార్చుకోవాలా? ఈ విషయం మీదా కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో కదా హరీశ్?