పిలుస్తున్న జగనన్న పలక్కున్న ధర్మాన

సీఎం జగన్‌తో సమావేశమంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పకుండా హాజరవుతారు. అధినేత ఏం చెప్తారో వినాలని కొందరు.. అధినేత దృష్టిలో పడాలని ఇంకొందరు.. అధినేతను కలిసే అవకాశం దొరికిందని మరికొందరు.. ఇలా జగన్‌తో సమావేశం అంటే తప్పనిసరి పరిస్థితులుంటే తప్ప డుమ్మా కొట్టరు. కానీ, జగన్ కేబినెట్లోని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం వరుసగా మూడు పర్యాయాలుగా జగన్ నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ఏదో ఒక సాకు చెప్పి అక్కడకు వెళ్లకుండా గైర్హాజరవుతున్నారు.

రెండు రోజుల కిందట జగన్ నిర్వహించిన కీలక సమావేశానికి గైర్హాజరైన అతికొద్ది మంది మంత్రులతో ధర్మాన కూడా ఒకరు. తాజాగా ప్రభుత్వ పథకం ఆసరాకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున తాను రాలేనని చెప్పి వెళ్లలేదు. అంతకుముందు రెండుసార్లు కూడా ధర్మాన ఇదే తరహాలో ఇతర కారణాలు చెప్పి జగన్‌ను కలవలేదు. ఓసారి… కొద్ది నెలల కిందట వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో హత్యకు గురైనా శ్రీకూర్మం మాజీ సర్పంచ్, వైసీపీ నేత బరాటం రామశేషు సంస్మరణ సభ ఉందన్న కారణంతో ధర్మాన ఆ సమావేశానికి వెళ్లలేదు. నిజానికి రామశేషు 2022లో హత్యకు గురయ్యారు. ఆ తరువాత అనేక సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కొన్నిటికి ధర్మాన హాజరయ్యారు. రామశేషు ధర్మానకు సన్నిహితుడే అయినా దానికి హాజరయ్యే కారణంతో ఏకంగా పార్టీ అధినేత, రాష్ట్ర సీఎం నిర్వహించే సమావేశానికి మంత్రి హోదాలో ధర్మాన వెళ్లకపోవడం అప్పుడు చర్చనీయమైంది.

ఇంకోసారి తన సోదరుడి కుమారుడు ఒకరు చనిపోయారని.. రాలేనని చెప్తూ జగన్ మీటింగుకు ధర్మాన డుమ్మా కొట్టారు. కానీ, అదే మీటింగ్‌కు ధర్మాన మరో సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెళ్లడంతో ధర్మాన ప్రసాదరావు చెప్పిన కారణం అంతా హంబక్ అని పార్టీ వర్గాలలో చర్చ జరిగింది.

మరి..జగన్ పిలుస్తుంటే వెళ్లడానికి ధర్మాన ఎందుకు వెనుకాడుతున్నట్లు?.. దీనికి కారణాలు చెప్తున్నాయి వైసీపీ వర్గాలు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని జగన్ అనుకుంటున్నారని.. ఆ క్రమంలోనే తన ప్రభుత్వంలో ఇప్పటివరకు రెండు పర్యాయాలుగా ధర్మాన సోదరులకు మంత్రి పదవులివ్వడం ద్వారా వెలమలకు ప్రాధాన్యమివ్వడంతో ఇప్పుడు కాళింగులకు కొద్దికాలం పాటు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని జగన్ అనుకుంటున్నారట. అందుకే… స్పీకర్ తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకుని స్పీకరు పదవిలోకి ధర్మాన ప్రసాదరావును తీసుకెళ్లాలని జగన్ అనుకుంటున్నారట.

ధర్మాన కూడా సీనియర్ కావడంతో అసెంబ్లీ నియమాలు, నిబంధనలు, చట్టాలు అన్నీ ఆయనకు కూడా కొట్టిన పిండి కావడంతో సభకు స్పీకరుగా సరిగ్గా సరిపోతారని జగన్ భావిస్తున్నారట. ఆ సంగతి ఇప్పటికే ధర్మానకు చూచూయగా చెప్పగా ధర్మాన ఎలాగైనా మంత్రి పదవిలో కొనసాగే ఉద్దేశంతో ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఈక్వేషన్స్ సెట్ కాకుంటే మంత్రి పదవి నుంచి తప్పించేయండి కానీ స్పీకరు పదవి మాత్రం తనకొద్దు అని ధర్మాన చెప్తున్నారట. స్పీకరు పదవి తీసుకోకుండా మంత్రి పదవి నుంచి దిగిపోయి కాళింగులకు మంత్రి పదవి దక్కితే వెలమలలో వ్యతిరేకత వస్తుందని.. ఆ సంగతి జగన్‌కు కూడా తెలుసు కాబట్టి తనను మంత్రి పదవి నుంచి తొలగించకపోవచ్చన్నది ధర్మాన వ్యూహంగా చెప్తున్నారు.

అయితే… జగన్‌ను కనుక పార్టీ సమావేశాలలో కలిస్తే ఆయన ఈ అందరిముందు ఈ ప్రతిపాదన పెడితే కాదనలేని పరిస్థితి వస్తుందని.. అందరి ముందు జగన్‌ను ప్రాథేయపడడం కానీ, ఒప్పించడం కానీ తనకు సాధ్యం కాదన్న ఉద్దేశంతో ధర్మాన ఏకంగా జగన్ సమావేశాలకు డుమ్మా కొడుతున్నట్లు చెప్తున్నారు. మొత్తానికి ధర్మాన మామూలోడు కాదు.