సంజయ్ అరెస్ట్.. మోదీ వరకు వెళ్లిన వ్యవహారం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చేరింది. జేపీ నడ్డా, అమిత్ షాలను దాటి ప్రధాని మోదీకి విషయం తెలిసింది. సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ హైకమాండ్ తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ ప్రధాని మోదీని కలిసి విషయం వివరించారు. దీంతో బండి సంజయ్‌కు పార్టీ పూర్తిగా అండగా ఉండాలని మోదీ సూచించినట్లు సమాచారం.

దీంతో మోదీతో భేటీ తరువాత జేపీ నడ్డా, అమిత్ షాలు మరికొందరు బీజేపీ కీలక నేతలతో సమావేశమై ఏం చేయాలో చర్చించారని.. తెలంగాణకు చెందిన కొందరు నేతలతో ఫోన్లో మాట్లాడి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఆరా తీశారని చెప్తున్నారు. కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి బండి సంజయ్ కోసం మొత్తం అందరూ రంగంలో దిగాలని సూచించినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే దిల్లీలో ఉన్న రాజ్యసభ ఎంపీ లక్ష్మన్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌లో దిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ప్రభుత్వం పై ఆగ్రహించారు. అమిత్ షా ఆదేశాలతో కిషన్ రెడ్డి వెంటనే తెలంగాణ డీజేపీతో మాట్లాడారు.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావుతో మాట్లాడి విషయం మొత్తం తెలుసుకున్నారు. సంజయ్ అరెస్ట్ తరువాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామలను ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేయాలని ఆయన సూచించారు.

బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌తో పాటు పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో.. సంజయ్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ చేపట్టే కార్యక్రమాలు, నిరసనల బాధ్యతలను ఇతర నేతలు ముందుండి నడపించేలా పార్టీ దిశానిర్దేశం చేస్తోంది.