చంద్రబాబు జోరు పెంచుతున్నారా ?

ఒకవైపు ఎన్నికల వేడి పోరిగిపోతున్న నేపధ్యంలోనే చంద్రబాబు నాయుడు మరింత జోరు పెంచుతున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోను వరుస పర్యటనలతో తమ్ముళ్ళల్లో మంచి ఉత్సాహం తీసుకురావటానికి చంద్రబాబు మూడు సమావేశాలను నిర్వహించబోతున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో విశాఖపట్నం, కడప, నెల్లూరులో చంద్రబాబు జోనల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. పై మూడు ప్రాంతాలు కూడా మొన్నటి మూడు పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాలు కావటమే గమనార్హం.

మొన్నటి మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో ఒకటి ఉత్తరాంధ్ర నియోజకవర్గం కాగా మిగిలిన రెండు నియోజకవర్గాలు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు. ఇప్పటికే నియోజకవర్గాలను టీడీపీ జోన్లుగా విడదీసిన విషయం తెలిసిందే. ప్రతి 30-35 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి పార్టీ ఒక్కో జోన్ గా ఏర్పాటు చేసింది. ఈ జోనల్ మీటింగులను మొదటి ఉత్తరాంధ్రతో చంద్రబాబు మొదలుపెడుతున్నారు. అందుకనే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎంఎల్ఏలు, ఎంపీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలందరినీ సమావేశానికి రావాలని సమాచారం అందించింది.

ఇదే విధంగా రాయలసీమ ప్రాంతంలోని తమ్ముళ్ళందరికి కూడా సమాచారం అందింది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే వరుసగా నాలుగు ఎంఎల్సీ స్ధానాలను గెలవటంతో చంద్రబాబు, తమ్ముళ్ళల్లో ఒక్కసారిగా జోరు పెరిగిపోయింది. రెట్టించిన ఉత్సాహంతో నేతలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. నాలుగేళ్ళుగా పార్టీలో ఎక్కడున్నారో కూడా తెలీని నేతలంతా ఇపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైన కనబడుతున్నారు. అలాగే పార్టీలో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు.

చాలాకాలంగా ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లాంటి వాళ్ళు పార్టీతో సంబంధంలేదన్నట్లుగానే వ్యవహరించారు. ఇందుకనే వీళ్ళపై పార్టీలోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. అలాంటిది నాలుగు ఎంఎల్సీ ఎన్నికల్లో గెలవగానే గంటా, ప్రత్తిపాటి బాగా యాక్టివ్ గా కనబడుతున్నారు. చంద్రబాబుతో సమావేశమవుతు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటు, మీడియా ముందు కూడా కనబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను, ప్రభుత్వాన్ని హోలు మొత్తంగాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపు తమ్ముళ్ళల్లో జోరు పెరిగిందన్నది మాత్రం వాస్తవం. అందుకనే చంద్రబాబు కూడా వరుసగా జోనల్ ప్రాంతాల్లో టూర్లు పెట్టుకున్నారు.