వైసీపీ నేతతో లోకేష్ చర్చలు?

ఈ వార్తలో నిజం ఎంతో తెలీదు కానీ వైసీపీ సోషల్ మీడియాలో  విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పాదయాత్రలో నారా లోకేష్ ను కలిశారట. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో పాదయాత్రలో ఉన్న లోకేష్ తో పేర్నాటి భేటీ అయ్యారనే వార్త కలకలం సృష్టిస్తోంది.  ఈమధ్యనే అధికారపార్టీ అభ్యర్ధిగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంఎల్సీగా పోటీచేసి పేర్నాటి ఓడిపోయిన విషయం తెలిసిందే.

పేర్నాటి నెల్లూరు జిల్లాకు చెందిన నేత. గెలుపు అవకాశాలు ఉండికూడా తాను ఓడిపోయిన విషయమై పేర్నాటి బాగా మండిపోతున్నట్లు సమాచారం. మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి ప్రధాన మద్దతుదారుల్లో పేర్నాటి కూడా ఒకళ్ళు. ఆర్ధిక, అంగబలం ఉన్న వ్యక్తి కావటంతోనే ఎన్నికల్లోకి దిగారు. అయితే అన్నీ విధాలుగా గట్టి అభ్యర్ధి అయిన పేర్నాటి ఎంఎల్సీగా గెలిస్తే తనకు ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రే వెనుకనుండి పేర్నాటి ఓటమికి ప్లాన్ చేశారనే ప్రచారం మొదలైంది.

దాంతో వైసీపీలో ఉండి ఉపయోగంలేదని అర్ధమైపోవటంతో పేర్నాటి టీడీపీలో చేరాలని డిసైడ్ చేసుకున్నారట. అందుకనే లోకేష్ తో కూడా భేటీ అయినట్లు పార్టీలో చర్చ మొదలైంది. ఈ విషయమై పార్టీ నేతలు ఎక్కడా నోరు విప్పటంలేదు. అయినా ప్రచారం మాత్రం పెరిగిపోతోంది. ఈ ప్రచారం అబద్ధమని కానీ నిజమే అని కాని ధృవీకరించటానికి కూడా ఎవరు ఇష్టపడటంలేదట. దాంతో జరుగుతున్నది చూసిన తర్వాత నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నిప్పులేనిదే పొగరాదు అన్న సామెతను కూడా పేర్నాటి విషయంలో జరుగుతున్న ప్రచారానికి అన్వయించి మాట్లాడుతున్నారు. ఓటమి తర్వాత ఒకటికి రెండుసార్లు పేర్నాటి తన ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారట. ఆ తర్వాతే ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చిందనేది ప్రచారం సారాంశం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున తాను టికెట్ ఆశించటం లేదని కూడా లోకేష్ తో పేర్నాటి స్పష్టం చేశారట. కాకపోతే తనకు సరైన గౌరవం దక్కితే చాలని చెప్పారట. అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే లోకేష్ ను పేర్నాటి కలిసిందే నిజమైతే మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమి చేస్తున్నట్లు ?