పవన్ భవిష్యత్తుపై ఉండవల్లి ఏమంటున్నారు?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తుల విషయంలో ఆయన క్లారిటీకి రాలేకపోతున్నారు. అయినా జన సైనికులు మాత్రం నిరాశ పడటం లేదు. ఎన్నికల నాటికి పొత్తులు ఖరారవుతాయన్న విశ్వాసంలో వాళ్లు పనిచేసుకుపోతున్నారు..

పవన్ కల్యాణ్ పై ఏపీలో మాత్రం నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ బలం రెట్టింపయిందని ఆయన విశ్లేషించారు. రెండు మూడు ఇంటర్వ్యూల్లో ఆయన ఇదే మాట చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు ఆరు శాతం ఓట్లు వచ్చాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అది 12 శాతం వరకు పెరిగిందని ఉండవల్లి చెబుతున్నారు. ఎన్నికల నాటికి అది 15 శాతానికి చేరుకున్నా ఆశ్చర్యం లేదని ఉండవల్లి వాదన. గత ఎన్నికల్లో పవన్ పార్టీ ఘోరంగా దెబ్బ తిన్న మాట వాస్తవమేనని అంటూ.. ఇప్పుడు మాత్రం జనంలో జనసేన పట్ల విశ్వాసం బాగా పెరిగిందని చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే అధికార వైసీపీ మట్టి కరవడం ఖాయమని ఉండవల్లి విశ్లేషిస్తున్నారు.

పొత్తులు మోదీ ఇష్టం

పొత్తులపై ఉండవల్లి వింత వాదన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పొత్తు ప్రధాని మోదీ చేతిలో ఉన్నాయని ఆయన అంటున్నారు. జగన్ గెలవాలని మోదీ అనుకుంటే చంద్రబాబు, పవన్ ను విడదీస్తారని లెక్కగడుతున్నారు. అదే జగన్ తో పనేముందిలే ఓడిచ్చేద్దామని అనుకుంటే మాత్రం పవన్ ను చంద్రబాబుతో పొత్తుకు ఒప్పిస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే మాత్రం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారడం ఖాయం.