ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడుతున్న కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇంటెలిజెన్స్ అధికారులకు పని పెరుగుతోంది. ఎప్పటికప్పుడు తాజా నివేదికలను సీఎం కేసీఆర్‌కు అందిస్తోంది ఇంటెలిజెన్స్ విభాగం. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్థితిగతులే కాకుండా విపక్ష కాంగ్రెస్, బీజేపీల బలాబలాలు ఎలా మారుతున్నాయన్న నివేదికలూ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు కేసీఆర్. ఇతరులపై ఆధారపడకుండా ఇంటెలిజెన్స్ నివేదికలను నేరుగా ఆయనే పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ప్రజాభిప్రాయం ఏమిటీ..? ఏం కోరుకుంటున్నారు..? ఎందుకు తమ పార్టీపై వ్యతిరేకత ఉంది..? ఎమ్మెల్యే పని తీరు బాగులేదా..? వంటి 20 అంశాలు ఫోకస్డ్‌గా ఇంటెలిజెన్స్ విభాగం నిత్యం వివరాలు సేకరిస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే ఆయన వివిధ నియోజకవర్గాల నేతలకు నేరుగా సూచనలు చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో 5 వేలకు మించి మెజార్టీ రాని నేతలందరినీ నియోజకవర్గాలు దాటి బయటకు రావొద్దని .. అక్కడే నిత్యం ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు.

మరోవైపు ఎమ్మెల్యేలుగా గెలిచిన తరువాత కూడా వ్యాపార వ్యవహారాలే తప్ప జనం గురించి పట్టించుకోని 19 మంది నేతల లిస్ట్ ఒకటి కేసీఆర్ దగ్గర ఉందని.. వారికి త్వరలో క్లాస్ పీకే కార్యక్రమం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేల చిట్టా పద్దులు సీఎం కేసీఆర్‌ చేతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల బలం, బలహీనతలను కూడా కేసీఆర్‌ పసిగట్టారు. ఆర్థిక, అంగ బలం ఎంత మేరకు ఉన్నాయో కూడా ఇప్పటికే లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక బలం లేని వ్యక్తులకు పార్టీ నుంచి ఎవరెవరికి సపోర్ట్‌ చేయాలో కూడా వివరాలను తీశారు.

ఈ ఎన్నికల్లో పార్టీ రూల్స్‌ను వినకుండా తోక జాడిస్తే.. అలాంటి వారిపై చర్యలకు కూడా వెనకాడేది లేదన్న ఆలోచనలో ఉన్నారు. అసమ్మతి రాగం వినిపిస్తే దారిలో పెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే సమ్మేళనాలతో అసమ్మతి వర్గాన్ని దారిలోకి తెచ్చే ప్రయత్నం మొదలైంది. వచ్చే నెల ముగిసే లోపు అందరు సక్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్‌ చేశారు. ఎమ్మెల్యేలను పల్లెలు వదిలి పట్నం రావద్దని అల్టిమేటం జారీ చేశారు.

ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ అంటే అభిమానం ఎక్కువగా ఉందని, అయితే, స్థానిక నేతల తీరు కారణంగా చాలామంది బీఆర్ఎస్‌కు దూరమవుతున్నారని వినిపిస్తోంది. ముఖ్యంగా గ్రామ, మండల స్థాయిలో టీఆర్ఎస్ నేతల ఆగడాల వల్ల ఇబ్బందులు పడుతున్నామన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ కారణంగానే ఎక్కువ మంది పార్టీకి దూరమవుతున్నట్లు కేసీఆర్‌కు నివేదికలు అందుతుండడంతో స్థానిక నాయకులను అదుపులో పెట్టాల్సిందిగా ఎమ్మెల్యేలను హెచ్చరించనున్నట్లు టాక్.