జగన్ కేబినెట్లోకి కొడాలి, బాలినేని?

ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రి పదవులు ఎవరికి వస్తాయి.. ఎవరి పదవులు ఊడుతాయనే విషయంలో రోజురోజుకీ అంచనాలు, ఊహాగానాలు మారిపోతున్నాయి. నిజానికి పార్టీ అధిష్టానం వద్ద దీనిపై జరుగుతున్న ఎక్సర్‌సైజ్‌లోనూ అనేక ఈక్వేషన్లు చెక్ చేస్తుండడంతో ఆ ప్రకారమే పార్టీవర్గాల నుంచి బయటకు లీకులొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న పేర్లుపై ఆ పార్టీ ఆశావహులు నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అందుకు కారణం.. జగన్ తొలి కేబినెట్లో స్థానం దక్కించుకుని తరువాత డ్రాప్ చేసిన ఇద్దరు నేతలను మళ్లీ ఇప్పుడు మంత్రివర్గంలో చేర్చుకుంటారని వినిపిస్తుండడమే.
2019లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఏర్పడిన తొలి కేబినెట్‌ను అక్కడికి మూడేళ్ల తరువాత పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు కొద్దిమంది మంత్రులను కొనసాగించి మిగతావారిని తప్పించారు.

అలా మంత్రివర్గం నుంచి తప్పించిన కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డిలను మళ్లీ ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారని వినిపిస్తోంది. ఈ మేరకు జగన్ వద్ద జరిగిన కసరత్తులలో వివిధ పేర్లు పరిశీలనలోకి తీసుకుంటున్నా.. జగన్ తాజాగా ఈ రెండు పేర్లను ప్రస్తావించారని.. ఆయనే స్వయంగా చెప్పడంతో ఈ ఇద్దరికీ పదవి ఖాయమని జోరుగా వినిపిస్తోంది. అయితే… కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ పాతమంత్రులకే చాన్సివ్వడం అన్యాయమంటున్నారు ఆశావహులు.

కొడాలి నాని మంత్రిగా ఉన్న కాలంలో విపక్ష టీడీపీపై విరుచుకుపడుతుండేవారు. కానీ, మంత్రి పదవి పోయిన తరువాత ఆయన స్పీడు తగ్గించారు. చంద్రబాబు, లోకేశ్‌లపై ఇప్పటికీ ఆయన విమర్శలు చేస్తున్నా కూడా అప్పటి తరహాలో ప్రతి రోజూ ఏకిపడేయడమనే కార్యక్రమం మానేశారు. అదేసమయంలో ఇప్పుడున్న మంత్రులలో టీడీపీని తిట్టడంలో కొడాలి స్థాయిలో ఎవరూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ కొడాలిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం.

అలాగే… బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గత ఏడాది మంత్రి పదవి పోగొట్టుకున్న తరువాత తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొద్ది నెలల వరకు ఆయన మళ్లీ యాక్టివ్ కాలేకపోయారు. ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో టీడీపీ పుంజుకోవడం.. నెల్లూరులో పార్టీలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో బాలినేనిని పూర్తిస్థాయిలో వాడుకుని వచ్చే ఎన్నికలలో ఆయన్ను కీలకం చేసే ఆలోచనతో మళ్లీ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేరు కూడా మంత్రివర్గంలోకి తీసుకునే నేతల జాబితాలో వినిపిస్తోంది. అయితే.. జగన్ ఫైనల్ చేసే జాబితాలో మళ్లీ ఎలాంటి మార్పులుంటాయనేది ఎవరూ ఊహించలేనట్లుగా ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు.