చంద్రబాబు ముందస్తు వ్యూహం

తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో జోష్ ను నింపాయి. భవిష్యత్తుపై భరోసాను ఇచ్చాయి. దానితో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా తెలుగు తమ్ముళు సై అంటున్నారు. వారికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొండంత అండగా ఉంటున్నారు. పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకూ అందరూ ప్రజల్లో ఉండే విధంగా వరుస కార్యక్రమాలకు టీడీపీ ప్రణాళిక రూపొందిస్తున్నారు.

టీడీపీ ఇప్పుడు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు నిర్వహించడం ఒక వంతయితే… ప్రజా సమస్యల పై పోరాటాలు మరో వంతు అని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. సంస్థాగత కార్యక్రమాలను బలోపేతం చేసి జనంలోకి వెళ్లాలని తెలుగుదేశం నిర్ణయించింది. గేర్ మార్చి పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల దిశగా పరిగెత్తించాలని ఆ పార్టీ హైకమాండ్ భావించింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి పంచుమర్తి అనురాథ గెలుపుతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. పరాజయ భారంతో కుంగిపోయిన వైసిపి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు గుర్తుచేశారు. ఇందుకోసం పార్టీ క్యాడర్ ను, లీడర్ లను సమాయత్తం చేయాలని అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు.

ఇక ముందు కార్యకర్త నుంచి పార్టీ అధినేత వరకూ జనంలో ఉండాలని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఒకవైపు నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు చిత్తూరు తర్వాత అనంతపురం నియోజకవర్గంలో భారీ స్పందన రావడం శుభ సూచకమని పార్టీ నేతలు అంటున్నారు.

పార్టీ వ్యూహాలు ఖరారు చేసే దిశగా ఈ నెల 28వ తేదీ నుంచే వరుస కార్యక్రమాలకు టీడీపీ హైకమాండ్ ప్రణాళిక రూపొందించింది. మార్చి 28వ తేదీన హైదరాబాద్ లో పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. చాలా తరువాత హైదరాబాద్ లో పోలిట్ బ్యూరో మీటింగ్ జరుగుతోంది. మే లో జరిగే మహానాడు నిర్వహణతో సహా, పలు అంశాల పై పోలిట్ బ్యూరోలో చర్చిస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యల పై చర్చించి తీర్మానాలు చేయాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ ఆవిర్బవ దినోత్సవం సందర్బంగా మార్చి 29వ తేదీన హైదరాబాద్ లో ప్రతినిధుల సభను ఏర్పాటు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే సభకు రెండు రాష్ట్రాల టీడీపీ నేతలను రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆవిర్బావ సభకు క్లస్టర్ ఇన్‌చార్జ్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు నాయకులను ఆహ్వానించారు. ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ , నెల్లూరు , కడప జిల్లాల్లో పార్టీ జోనల్ సమావేశాలను నిర్వహించనున్నారు.

ఈ సమావేశాల అనంతరం అధినేత చంద్రబాబుతో సహా, రాష్ట్ర నాయకత్వం అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహణతో పాటు, ప్రజా సమస్యల పై నియోజకవర్గ , జిల్లా స్థాయి పోరాటాలకు కసరత్తు చేయాలని భావించారు.అధినేత నుంచి గ్రామ స్థాయి నేత వరకూ అంతా క్షేత్రస్థాయిలో ఉండేలా కార్యక్రమాలకు రూప కల్పన చేస్తున్నారు. టీడీపీ ఇక అన్‌ స్టాపబుల్ అని పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. బాలయ్య చెప్పినట్లుగా ఇక దబిడి దిబిడేనని టీడీపీ నేతలంటున్నారు…