జగన్‌పైకి శ్రీదేవి బాంబులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వ్యతిరేకత, అసమ్మతి స్వరాలు ఎదుర్కొంటున్నారు. పార్టీలో అసంతృప్త నేతలందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తూ జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

అందులోనూ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో అసమ్మతి నేతల స్వరం మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి టీడీపీ అభ్యర్థి అనురాధ విజయానికి దోహదం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఒకే రోజు జగన్ మీద తీవ్ర స్థాయి విమర్శలు, ఆరోపణలకు దిగారు. ముఖ్యంగా శ్రీదేవి.. జగన్ మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం ఒకటి. ఐతే అదో పెద్ద స్కామ్ అని శ్రీదేవి ఆరోపించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. అమరావతి రైతుల విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన శ్రీదేవి.. రైతులకు క్షమాపణ చెప్పారు. వారి పోరాటానికి తన మద్దతు ఉంటుందని అన్నారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్నల మాదిరే తనను కూడా చంపేయాలని కుట్ర జరుగుతోందని.. ఏపీలో దళితులకు ఏ మాత్రం రక్షణ లేని అరాచక పరిస్థితులు నెలకొన్నాయని.. అందుకే తాను హైదరాబాద్‌లో ఉండి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే అయిన తన పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఆమె ప్రశ్నించారు. తనకు ప్రాణ హాని ఉందని.. తనకు ఏదైనా జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత అని ఆమె అన్నారు. తనకు ప్రాణ హాని లేదని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తేనే తాను ఏపీలో అడుగు పెడతానని శ్రీదేవి వ్యాఖ్యానించారు. జగన్‌కు తాను త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆమె చివరగా పంచ్ ఇచ్చారు.