23 వర్సెస్ 175

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో అధికార వైసీపీకి ఝలక్ ఇచ్చాయి. మూడు పట్టభద్రుల స్థానాల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే పార్టీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో తల బొప్పికట్టే పరిస్థితి వచ్చింది. మొత్తం నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడంతో పార్టీ అభ్యర్థి కోలా గురువులు ఓడిపోయారు. టీడీపీ నిలబెట్టిన పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఇంకేముంది ప్రధాన ప్రతిపక్షం స్పీడు పెంచింది. రెండు పార్టీల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డైలాగ్ వార్ మొదలైంది..

కొంతకాలం వైసీపీ అధినేత వైనాట్ 175 అనే నినాదాన్ని అందుకున్నారు. కుప్పం సహా 175 నియోజకవర్గాల్లోనూ తామె గెలిచి తీరుతామని చెప్పుకుంటున్నారు. టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని వైట్ వాష్ ఖాయమని అంటున్నారు. దానికి కొంత కాలంగా కౌంటర్లిస్తూ వచ్చిన టీడీపీ, పట్టభద్రుల ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురుదాడి వేగం పెంచింది. పులివెందుల సహా 175 తమవేనని చెప్పుకుంటోంది. నిజానికి టీడీపీ స్పీడ్ చూసి వైసీపీ కాస్త డిఫెన్స్ లో పడిపోయిన మాట వాస్తవం.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక్లలో పంచుమర్తి అనురాధ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో ఒక సెంటిమెంట్ లెక్క ప్రచారమైంది. చంద్రబాబు పార్టీ కూడా దాన్ని అందుకుంది. టీడీపీకి మొదట 23 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని, నలుగురు పోయినా ఇప్పుడు మళ్లీ 23 ఓట్లతో అనురాధ గెలిచారని పార్టీ గుర్తు చేసింది. పైగా 2023వ సంవత్సరం మార్చి 23వ తారీఖున జరిగిన ఎన్నికల్లో 23 ఓట్లతో అనురాధ విజయం సాధించడంతో 23 సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందని లక్క తేల్చారు.

టీడీపీ సెంటిమెంట్ కు వైసీపీ ఇప్పుడు కొత్త కౌంటరిస్తోంది. తిప్పితిప్పి ఎన్ని లెక్కలు చెప్పినా టీడీపీ బలం 23 దాటడం లేదని అంటోంది. అనురాధ గెలిచినందుకు చంద్రబాబు సంబరపడిపోతున్నారని అంటూ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసిన టీడీపీ బలం 23 దాటదని వైసీపీ వెక్కిరిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబుకు తరపున గెలిచేది 23 మంది ఎమ్మెల్యేలేనని వైసీపీ అంటోంది.

వైసీపీ కొత్త వాదనకు టీడీపీ గట్టి కౌంటరిస్తోంది ఇంత జరుగుతున్నా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని వ్యాఖ్యానిస్తున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో పులివెందుల సహా అన్ని స్థానాల్లో తామే విజయం సాధిస్తామని సవాలు చేస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ దాటి రాని జగన్ ఇక ఇంటికే పరిమితం కావడం ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ 23 వర్సెస్ 175 సవాలు చాలా రోజులు కొనసాగే అవకాశాలున్నాయి..