అమ‌రావ‌తిలో జ‌గ‌న్ స‌ర్కారు మ‌రో చిచ్చు.. ర‌గులుతున్న ఆర్-5

ఆది నుంచి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్.. ఎప్ప‌టిక‌ప్పుడు.. ఇక్క‌డ ఏదో ఒక వివాదాన్ని సృష్టించ‌డం.. రైతుల క‌డుపు మంట‌ను రెచ్చ‌గొట్ట‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆర్‌-5 వివాదాన్ని మ‌రోసారి స‌ర్కారు రెచ్చగొట్టింది. రాష్ట్రంలో ఎక్క‌డెక్క‌డో ఉన్న పేద‌ల‌కు.. ఇక్క‌డ భూములు కేటాయించ‌డ‌మే ఆర్‌-5 ఉద్దేశం.
అయితే.. దీనిని ఆది నుంచి కూడా రైతులు వ్య‌తిరేకిస్తున్నారు. తాము బూములు ఇచ్చింది కేవ‌లం రాజ‌ధాని కోస‌మేన‌ని తేల్చి చెబుతున్నారు. అయినా.. స‌ర్కారు వినిపించుకోవ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు ఆర్5 జోన్ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది.

పేదల ఇళ్ల నిర్మాణం కోసమంటూ ప్రత్యేకంగా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలం మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900 ఎకరాల భూములను ఆర్ 5 జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2022 అక్టోబర్ లో సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే.. జ‌గ‌న్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు వ్యతిరేకించారు. కనీసం రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవటంపై అప్పట్లో కోర్టుకు వెళ్లారు. దీంతో గ్రామసభలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజధాని గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. అమరావతి బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు.

అయినా కూడా.. ఇంత‌గా రైతులు వ్య‌తిరేకించినా.. వారి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్ 5 జోన్ గెజిట్ విడుదల చేశారు. పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్లు వివరించింది. ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపడతారో, ఎంత విస్తీర్ణంలో చేపట్టాలనేది గెజిట్లో పొందుపర్చారు. సీఆర్డీఏ విడుదల చేసిన గెజిట్ పై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఏదేమైనా.. వైసీపీ స‌ర్కారు రాజ‌ధాని విష‌యంలో అనుస‌రిస్తున్న తీరు తీవ్ర వివాదానికి.. విమ‌ర్శ‌ల‌కు తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.