ఆయనకు నోటీసులే రాలేదా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగం పెరిగింది. కవితను ఈడీ అన్ని కోణాల్లో విచారిస్తోంది. ఇప్పటికే 12 మంది ఈ కేసులో అరెస్టయ్యారు. వారికి వరుస కస్డడీలు కొనసాగుతున్నాయి. అందులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా చప్పాలి.

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన తనయుడు రాఘవ రెడ్డి పేర్లు కూడా ఛార్జ్ షీటులో ఉన్నాయి. రాఘవ రెడ్డి ఇప్పటికే అరెస్టయ్యారు. ఆయన తండ్రి శ్రీనివాసుల రెడ్డికి కూడా కష్టాలు తప్పవని భావిస్తున్నారు.

ఈ నెల 18న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఈడీ విచారణకు పిలిచిందని ప్రచారం జరిగింది. ఆ రోజు ఆయన హాజరు కాకపోవడంతో మినహాయింపు కోరారని అందరూ అనుకున్నారు. మళ్లీ 20న రావాలని ఈడీ నోటీసులు పంపినట్లు చెప్పుకున్నారు. అంటే కవితను, ఆయన్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి సౌత్ గ్రూప్ లావాదేవీలపై ప్రశ్నించేందుకే 20న రమ్మన్నారని అనుకున్నారు. అయితే ఆ రోజు కూడా మాగుంట హాజరు కాలేదు.

మాగుంట శ్రీనివాసుల రెడ్డికి అసలు నోటీసులే వెళ్లలేదని తాజా సమాచారం. తనకు నోటీసులు అందకుండానే మీడియా ప్రచారం చేస్తోందని మాగుంట వాపోతున్నారట. అయితే కవితనే పిలిచిన వాళ్లు మాగుంటను ఎందుకు పిలవలేదన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక్కొక్కరినీ ఒక్కో సారి పిలిచి విచారించిన తర్వాత వీలును, అవసరాన్ని బట్టి అందరినీ కలిపి విచారించాలని ఈడీ భావిస్తున్నట్లు ఒక వార్త ప్రచారంలో ఉంది. అందుకే అరుణ్ రామచంద్ర పిళ్లైని కవిత ఎదురుగా ఇంకా కూర్చోబెట్టలేదట. సోమవారం కవితను, రామచంద్ర పిళ్లైను ఎదురెదురుగా కూర్చోబెట్టేందుకు ఈడీ ప్రయత్నించగా అందుకు పిళ్లై అంగీకరించలేదు. ఈడీ అనుకుంటే ఇద్దరినీ కూర్చోబెట్టడం కష్టమేమీ కాకపోయినా అధికారులు ఇప్పుడే తొందరపడ దలచుకోలేదని అంటున్నారు. అందుకే శ్రీనివాసుల రెడ్డి విచారణపై కూడా అంత ఆసక్తి కనిపించలేదు. కాకపోతే తొందర్లోనే పిలవడం ఖాయమని చెప్పక తప్పుదు.