పార్లమెంటు భవనాన్ని కూల్చేస్తాం.. తేల్చేసిన కేంద్రం

పురాతన భవనాలు.. చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాల్ని కాలానికి అనుగుణంగా కూల్చేయటం తప్పించి మరో మార్గం లేదా? చరిత్రకు సాక్ష్యాలుగా నిలవటానికి భిన్నంగా.. వాటిని నేలమట్టం చేసేసి.. దాని స్థానే కొంగొత్తగా భవనాల్ని కట్టుకుంటూ పోవటానికి మినహా మరో మార్గం లేదా? అన్న ప్రశ్న తలెత్తేలా వ్యవహరించింది కేంద్రంలోని మోడీ సర్కారు.

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం చాలా పాతదైందని.. దాన్ని కూల్చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో దాఖలుచేసింది. పార్లమెంటు భవనం వందేళ్ల పురాతన భవనమని.. భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నట్లుగా కేంద్రం చెప్పింది.

అంతేకాదు.. ఏదైనా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే..రక్షణ చర్యలు చేపట్టటం కష్టమని చెప్పింది. అందుకే.. ఇప్పుడున్న పార్లమెంటు భవనాన్ని కూల్చేసి.. దాని స్థానే కొత్త భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని 1921లో నిర్మాణం ప్రారంభించి.. 1937లో ముగించారు. ఇప్పటికి దగ్గరదగ్గర వందేళ్లు గడిచిన వేళ.. ఇప్పుడు కొత్త భవనం కోసం పాత భవనాన్ని కూల్చేస్తామని తేల్చేయటం గమనార్హం.

అంతేకాదు.. గడిచిన దశాబ్దాల రాజకీయ ఘటనలు.. కీలకమైన సమావేశాలు.. చారిత్రక సన్నివేశాలకు సాక్ష్యమైన పార్లమెంటు భవనాన్ని కూల్చేస్తామని చెప్పినమోడీ సర్కారు తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.