వైసీపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల టెన్ష‌న్‌…!


ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల టెన్ష‌న్ ప‌ట్టుకుంది. మొత్తం 7 స్థానాల‌కు ఇప్ప‌టికే నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా పూర్త‌యింది. ఈ నెల 23న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ కోటాలోనే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వంటి కీల‌క నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ఓట‌మితో ఉన్న వైసీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తుల వ్య‌వ‌హారం.. చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇప్ప‌టికే తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. కొంద‌రు వ్య‌తిరేకంగా ఓటేస్తే.. ప‌రిస్థితి ఏంటా అనేది వైసీపీ లో చ‌ర్చ సాగుతోంది. సుమారు 7 నుంచి 8 మంది.. ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. వీరంతా రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. సో.. అప్పుడు క‌నుక త‌ప్పుగా వేసినా.. లేక వేయ‌క‌పోయినా.. లేదు..ఇత‌ర పార్టీకి వేసినా.. వైసీపీ ప‌రిస్థితి కొంప కొల్లేరు టైపే!

మొత్తం ఏడుగురు అభ్య‌ర్థుల్లో బీసీలు.. మ‌హిళ‌లు.. ఓసీలు కూడా ఉన్నారు. వీరిని గెలిపించుకుంటే.. ఖ‌చ్చితంగా మండ‌లిలో త‌మ‌దే పెద్ద చేయి అవుతుందని జ‌గ‌న్‌భావిస్తున్నారు. అయితే.. టీడీపీ వ్యూహాత్మ‌కంగా ఒక స్థానానికి పోటీ చేస్తోంది. ఏ పార్టీ అయినా.. అభ్య‌ర్థులు గెలిచేందుకు 20-22 ఓట్లు రావాల్సి ఉంటుంది. సో.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబ‌ట్టి.. ఈ పార్టీ పంచుమ‌ర్తి అనురాధ‌ను రంగంలోకి దింపింది.

అయితే.. టీడీపీ నుంచి న‌లుగురు రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఉన్న నేప‌థ్యంలో ఆ పార్టీ విప్ జారీచేయాల‌ని భావి స్తోంది. ఇదే జ‌రిగితే.. ఆ న‌లుగురు కూడా టీడీపీకి అనుకూలంగా ఓటేయాలి. లేక‌పోతే అన‌ర్హ‌త వారికి వ‌ర్తిస్తుంది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి. ఇక‌, వైసీపీలోనూ ఇదే స‌మ‌స్య ఉంది. విప్ జారీ చేస్తారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా ఇరు పార్టీల్లోనూ టెన్ష‌న్ క‌నిపిస్తోంది.