పంజాబ్ అష్ట‌దిగ్బంధం.. ఎందుకు? ఏమిటి?

ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం గురించి విన‌డ‌మే త‌ప్ప‌.. అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియదు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పంజాబ్ పేరు మాత్ర‌మే ప‌రిచ‌యం. అంత‌కుమించి మాత్రం ఆ రాష్ట్రం గురించి తెలియ‌దు. అయితే.. ఇప్పుడు ఇదే పంజాబ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌ధాన వార్త‌లుగా నిలిచాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

పంజాబ్‌ను గ‌త 48 గంట‌ల నుంచి పోలీసులు అష్ట‌దిగ్బంధం చేశారు. రాష్ట్ర పోలీసులు.. కేంద్ర పారామిలిట‌రీ బృందాల బూటు చ‌ప్పుళ్ల‌తో రాష్ట్రంలోని అన్ని న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాలు క‌ర్పొరేష‌న్లు.. అట్టుడుగుతున్నాయి. పాఠ‌శాల‌లు మూసేశారు.(శ‌నివారం కూడా). బ్యాంకులు మూసేశారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల ముందు వంద‌ల మంది పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించారు. దాదాపు జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. అత్యంత అవ‌స‌రం ఉంటే త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆప్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. మ‌రి ఇంత సీరియ‌స్‌గా అక్క‌డ ఏం జ‌రుగుతోంది. అనేది ఆస‌క్తిగా మారింది.

ఖ‌లిస్థాన్‌.. అనే వేర్పాటు వాద సంస్థ‌కు నేతృత్వం వ‌హిస్తున్న‌ వారిలో అమృత్ పాల్ అనే యువ‌కుడు(30 ఏళ్లు) కీల‌కంగా మారాడు. ‘వారీస్ పంజాబ్ దే'(మా పంజాబ్‌ను మాకు ఇచ్చేయండి) అనే పేరుతో ఒక‌ సంస్థ‌ను ఏర్పాటు చేసి.. ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాడు. మత బోధకుడిగా చెప్పుకునే ఆ సంస్థ అధినేత అమృత్పాల్ సింగ్ ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. దొంగతనం, కిడ్నాప్, హింసకు పాల్పడటం వంటి కేసులు అమృత్పాల్ సింగ్పై నమోదయ్యాయి.

ఆ ఏడాది ఫిబ్రవరిలో ‘వారీస్ పంజాబ్ దే’ అధినేత అమృత్పాల్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసం సృష్టించి.. తమ మద్దతుదారుడిని విడుదల చేయించుకున్నారు. అమృత్పాల్ పిలుపుతో.. వేలాది మంది అనుచరులు తల్వార్లు, తుపాకులతో అజ్నాలా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. అమృత్పాల్ సింగ్ సన్నిహితుడు లవ్ప్రీత్ తుఫాన్ అరెస్టుకు నిరసనగా వారంతా ఆందోళన చేపట్టారు.

అయితే.. ఇటీవ‌ల అమృత్‌పాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. “ఇందిరా గాంధీకి ప‌ట్టిన గ‌తే.. అమిత్‌షాకు కూడా ప‌డుతుంది!” అన్నాడు. నిజానికి ఈ వ్యాఖ్యలు చేసి 15 రోజులు అయిపోయింది. అయితే.. అప్ప‌ట్లో రాష్ట్రంలో జీ-20 స‌ద‌స్సు జ‌రుగుతోంది. దీంతో విదేశీ ప్ర‌తినిధులు వ‌చ్చారు. ఈ ప‌రిణామాల‌పై ఉప్పందినా.. కేంద్రం మౌనంగా ఉంది. ఎందుకంటే ఏమాత్రం అల‌జ‌డి రేగినా.. విదేశీ ప్ర‌తినిధులు హ‌డ‌లి పోతార‌ని భావించింది. ఇక‌, ఈ స‌ద‌స్సు అయిపోగానే విశ్వ‌రూపం చూపించింది.

అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా పోలీసులు ప్రకటించారు. అమృత్‌పాల్ స్వస్థలమైన అమృత్‌సర్లోని జల్లుపుర్‌ ఖేరాలో అతడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ.. సంగ‌తి!!