జగన్ కు ఎదురుదెబ్బలు రెఢీగా ఉన్నాయా?

jagan

దేశంలో మరే రాజకీయ పార్టీ అధినేత చేయని ప్రకటన చేయటం ఏపీ ముఖ్యమంత్రి కమ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. తన శక్తి సామర్థ్యాల మీద అవగాహన ఉన్నా.. అతి విశ్వాసం కనిపించకూడదన్నట్లుగా కొన్ని వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని సైతం పట్టించుకోరు. అందుకు నిదర్శనంగా ఆయన వ్యాఖ్యల్నే చెప్పాలి.

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్ని మొత్తంగా గెలిచేసుకుంటామని.. వచ్చే ఎన్నికల్లో అదే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించటం దేనికి నిదర్శనం? ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్య పద్దతుల్ని గౌరవించే ఏ రాజకీయ నేత కూడా తనను ప్రశ్నించేందుకు ప్రతిపక్షం ఉండాలని కోరుకోటం కనీసం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా.. తాను మాత్రమే తప్పించి మరింకెవరూ ఉండకూడదన్నట్లుగా వ్యవహరించే ధోరణి దేనికి నిదర్శనం?

అయినా.. ఎంత ప్రజా బలం ఉంటే మాత్రం.. తన పార్టీ మాత్రమే గెలవాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది కదా? అంత దాకా ఎందుకు.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తన ధీమా పై ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణం అవుతుందన్న విషయాన్ని సైతం గుర్తించలేని జగన్ తీరును ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలన్న మాట రాజకీయ వర్గాల్లోనే కాదు.. వైసీపీలోని కొందరు నేతలు లోగుట్టుగా మాట్లాడుకోవటం నిజం కాదా? మరో ఏడాదిన్నర వ్యవధిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో ప్రతిపక్షం అన్నది లేకుండా చేయటమే లక్ష్యంగా పార్టీని సిద్ధం చేస్తున్న జగన్ కు.. తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు దారుణమైన షాక్ ను ఇచ్చాయన్న మాట వినిపిస్తోంది.

తన అద్భుత పాలనతో ఏపీ ప్రజలంతా తన వెంటే ఉన్నారని.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని ఛీ కొడుతున్నారన్న మాటను చెప్పే వైసీపీ నేతలకు దిమ్మ తిరిగేలా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఎదురయ్యాయి. పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో రెండింటిలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించటం సంచలనంగా మారింది. అందులోనూ అధికార పార్టీ బలంగా ఉందని చెప్పుకునే ఉత్తరాంధ్రలోనూ.. తూర్పు రాయలసీమలోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. అధికార పార్టీకి తిరుగులేని అధిక్యత ఉన్నట్లు చెప్పే పశ్చిమ రాయలసీమలో ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగటం ఇప్పుడు రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తాజాగా వెల్లడవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ కు ఎదురుదెబ్బల పరంపర మొదలైనట్లేనని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు ఏవైనా ఆయనకు తిరుగులేని అధిక్యతను కట్టబెట్టాయని.. తాజా ఎన్నికల్లో అందుకు బిన్నమైన సీన్ ఎదురైందని.. ప్రజాగ్రహానికి ఇదో నిదర్శనంగా చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార పార్టీకి చెందిన వారు చేసిన హడావుడి.. తమకు అనుకూలంగా పోలింగ్ జరిగేందుకు వీలుగా చేసిన ప్రయత్నాలు ఎన్ని అన్న విషయంపై మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున క్లిప్పుంగులువచ్చాయి. అయినప్పటికీ ఫలితాలు అనూహ్యంగా ఉండటం చూస్తే.. క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై ఇంత వ్యతిరేకత ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల షాక్ నుంచి తేరుకోక ముందే.. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ అరెస్టు అయ్యే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. అధికార పక్షానికి ఇబ్బందికర పరిస్థితి ఖాయమంటున్నారు. దీనికి తోడు ఇప్పటికే ఇబ్బందికరంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. రానున్న రోజుల్లో మరింత దిగజారి పోవటం ఖాయమని.. దీంతో మరిన్ని సమస్యలు సిద్ధంగా ఉంటాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉన్న నేపథ్యంలో.. ఇప్పటివరకు జరిగినట్లుగా అధికార పార్టీకి ఎదురులేని పరిస్థితులు ఉండవంటున్నారు. దీనికి తోడు.. పోలీసులు.. ఇతర విచారణ సంస్థలతో తమను ఇబ్బంది పెట్టిన అధికారపక్షంపై విపక్షాలు ఆగ్రహంతో ఉండటంతో పాటు.. కలిసి కట్టుగా గుణంపాఠం నేర్పాలన్న పట్టుదలతో ఉన్న నేపథ్యంలో.. రానున్న రోజులు సీఎం జగన్ కు గడ్డు పరిస్థితులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ వాదనలో నిజం ఎంతన్నది రానున్న కాలం చెప్పనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.