బీజేపీ డొల్లతనాన్ని చూపిన ఎమ్మెల్సీ ఎన్నికలు

జాతీయ స్థాయిలో వరుసగా రెండోసారి అధికారానికి వచ్చిన పార్టీ అది. ఆంధ్రప్రదేశ్లోనూ చక్రం తిప్పాలనుకున్నప్పటికీ ఆ పార్టీ ఇంతవరకు సాధించిందీ శూన్యమే.. ఇతర పార్టీల పంచన చేరిన రోజుల్లో కాస్త ప్రయోజనం పొందినప్పటికీ ఇప్పుడా అవకాశం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పట్టిందల్లా దరిద్రమే అన్నట్లుగా తయారైందీ పరిస్థితి..

బీజేపీ నేతలకు మాటలెక్కువ అంటారు. ఏపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మొదలుకుని పార్టీలో ప్రతీ ఒక్కరూ వాపును బలుపుగా భావిస్తుంటారు. ఆ వాపునే చూసుకుని ప్రతీ ఒక్కరిపై ఒంటికాలిమీద లేస్తుంటారు. ఆలు లేదు చూలు లేదు అల్లుడిపేరు సోమలింగం అన్నట్లుగా వాళ్లతో పొత్తుల్లేవ్ వీళ్లతో పొత్తుల్లేవ్ అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తుంటారు. కొందరికీ టీడీపీ అంటే ఇష్టం.. కొందరికీ జనసేన అంటే ఇష్టం. దానికి తగ్గట్టుగా నేతలు ప్రకటనలు వదలుతుంటారు..

మాధవ్ ఓటమి

అసెంబ్లీ ఎన్నికల్లో పోత్తులపై విభిన్న ప్రకటనలిచ్చే రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ సారి ఉత్తరాంధ్ర ప్రజలు గట్టి షాకే ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కి వాళ్లు కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. చెల్లని ఓట్ల కంటే మాధవ్ కు తక్కువ ఓట్లు వచ్చాయి. నోటా సే భీ ఛోటా అన్న మాట వారికి బాగానే సరిపోతుందనిపిస్తోంది. నాయకుల్లో అనైక్యత ఒకపక్క, జనబలం లేకపోవడం మరో పక్క బీజేపీకి శాపంగా మారింది.

గతంలో ఎలా..

మాధవ్ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా గెలిచారన్న చర్చ జరుగతుంది. అప్పట్లో టీడీపీ ఆయనకు మద్దతిచ్చింది. టీడీపీ కేడర్ మనస్పూర్తిగా మాధవ్ కు ప్రచారం చేసింది. ఈ సారి టీడీపీ దూరమైంది. టీడీపీ అభ్యర్థి బరిలో ఉండటం బీజేపీకి శాపమైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ఇష్టపడటం లేదని తేలిపోయింది.

హ్యాండిచ్చిన జనసేన

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తమ అభ్యర్థికి మద్దతిస్తుందని సోము వీర్రాజు గొప్పలు చెప్పుకున్నారు. జనసేన ఎక్కడా మద్దతు ప్రకటించలేదు. మద్దతివ్వబోమని కూడా చెప్పలేదు. కేడర్ ఆత్మప్రబోధానుసారం ఓటేస్తే చాలన్నట్లుగా జనసేనాని ఊరుకున్నారు. పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ పై బీజేపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో జనసేన కార్యకర్తలు కమలనాథుల తీరును విశ్వసించలేకపోయారు.పైగా ఉత్తరాంధ్రలోని తూర్పు కాపు సామాజిక వర్గాల వాళ్లు.. బీజేపీని అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. తమకు టీడీపీ మాత్రమే సరైన పార్టనర్ అని జనసేన కార్యకర్తలు, అభిమానులు నిర్ణయానికి వచ్చారు. దానితో టీడీపీ అభ్యర్తి విజయం సులభమైంది. మాదవ్ మితవాది అయినప్పటికీ,మృదు భాషి అయినప్పటికీ ఆయన మంచితనం ఎన్నికల్లో పనికి రాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీకి గడ్డుకాలం తప్పదు.