కవిత కష్టాలు – ఈడీ దూకుడు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచేస్తోంది. ఈనెల 20వ తేదీ నుండి స్కామ్ లో నిందితులను, అనుమానితులను కూర్చోబెట్టి జాయింట్ ఎంక్వయిరీలకు రెడీ అవుతోంది. ఇప్పటికే 20వ తేదీ విచారణకు హాజరవ్వాల్సిందే అని కవితకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అదేరోజు అరుణ్ రామచంద్రపిళ్ళై, ఆడిటర్ బుచ్చిబాబును కూడా విచారణకు పిలిపించింది. అవసరమైతే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మనీష్ సిసోడియాలను కూడా పిలిపించేందుకు రెడీగా ఉంది.

ఒకే అంశానికి సంబంధించి ఒకళ్ళకన్నా ఎక్కువమందిని పిలిపించి విచారణ చేయటాన్ని కాన్ఫ్రంటేషన్ ఎంక్వయిరీ అంటారు. అంటే విచారణ చేయటానికి పిలిపించ వాళ్ళందరినీ వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ఒకే ప్రశ్న వేసి సమాధానం రాబడతారు. ఆ ప్రశ్నకు ఎవరెవరు ఎలాంటి సమాధానం చెప్పారనేది రికార్డుచేస్తారు. ఇచ్చే సమాదానాలను బట్టి విచారణను మరింత ముందుకు తీసుకెళతారు. దీనివల్ల నిందితులు, అనుమానితులు దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అంటే కవితను కూడా 20వ తేదీన జాయింట్ ఎంక్వయిరీలో కూర్చోబెట్టే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటివరకు నిందుతులను, అనుమానితులను వేర్వురుగాను ఒక్కోసారి కాన్ఫ్రంటేషన్ ఎంక్వయిరీ పద్దతిలో విచారించింది. అయితే కవితను మాత్రం విడిగానే విచారించింది. మొదటిసారిగా కవితను కూడా వీళ్ళతో కలిపి విచారించే అవకాశముందని సమాచారం. విచారణకు హాజరుకాకుండా తప్పించుకునే ప్రయత్నంచేసేకొద్దీ కవితకే నష్టమని నిపుణులు అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే లిక్కర్ స్కామ్ లో తనకేమీ సంబంధంలేదని చెబుతున్న కవిత అదే విషయాన్ని విచారణకు హాజరై చెప్పవచ్చు కదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

మొత్తానికి 20వ తేదీ విచారణతో ఈడీ దూకుడు పెంచేయబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే కస్టడీలో ఉన్న వాళ్ళని కూడా విచారణకు మళ్ళీ రెడీచేస్తోంది. పిళ్ళై, బుచ్చిబాబు, సిసోడియా, రాఘవరెడ్డి లాంటి వాళ్ళని ఇప్పటికే చాలాసార్లు విచారించింది. అయినా మళ్ళీ మళ్ళీ విచారణకు పిలిపిస్తోంది. మొత్తానికి 20వ తేదీన కానీ ఆ తర్వాత కానీ లిక్కర్ స్కామ్ లో ఏదో జరగబోతోందనే వాతావరణం అయితే పెరిగిపోతోందన్నది నిజం. మరి ఆ రోజు ఏమి జరగబోతుందో చూడాల్సిందే.